తెలంగాణ లోక్సభ ఎన్నికలు: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
సారాంశం
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2,29,08,599 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.
05:35 PM (IST) Apr 11
ముగిసిన పోలింగ్: ఓటు వేయని వారిని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ నిజామాబాద్ మినహా ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారిని ఉద్దేశిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘‘ ఎవరైతే ఇప్పటి వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదో.. వారందరూ ఎక్కువ సంఖ్యలో ఓటు వేసే ప్రక్రియలో పాల్గొంటారో వారి వల్లే ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.
05:04 PM (IST) Apr 11
తెలంగాణలో ముగిసిన పోలింగ్
తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు గాను గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి ఘర్షణలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
మధ్యాహ్నం 3 గంటల వరకు 48 శాతం పోలింగ్ నమోదైంది.. మొత్తంగా 60 శాతం ఓటింగ్ జరిగి ఉండవచ్చని ఈసీ భావిస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నిజామాబాద్ లోక్స్ధానానికి సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
04:46 PM (IST) Apr 11
హైదరాబాద్లో ప్రశాంతంగా పోలింగ్: సీపీ
హైదరాబాద్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. నగరవాసులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పహారా కాస్తున్నామని ఇప్పటి వరకు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని సీపీ తెలిపారు.
04:12 PM (IST) Apr 11
పోలింగ్ బూత్ వద్ద మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నిరసన
టీఆర్ఎస్ నేతలు పోలింగ్లో బూత్లో తమ పార్టీ ఏజెంట్పై దాడి చేయడంతో పాటు రిగ్గింగ్కు పాల్పడ్డారంటూ మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నిరసన తెలిపారు. సిద్ధిపేట మండలంలోని ఇబ్రహీంపూర్ పోలింగ్ బూత్ ముందు ఆయన బైఠాయించారు.
04:06 PM (IST) Apr 11
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
తెలంగాణలోని 13 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల లోపు క్యూలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
03:07 PM (IST) Apr 11
టీఆర్ఎస్ నేతలు రిగ్గింగ్కు పాల్పడుతున్నారు: కాంగ్రెస్
ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్లో అధికారపార్టీ నేతలు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
01:37 PM (IST) Apr 11
ఓటు హక్కు వినియోగించుకున్న రోశయ్య
తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు.
01:35 PM (IST) Apr 11
గ్రామంలో విషాదం: ఓటింగ్కు దూరంగా గ్రామస్తులు
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో బుధవారం మట్టిపెళ్లలు విరిగిపడి 10 మంది ఉపాధి హామీ కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరణించిన వారికి నివాళిగా గ్రామస్తులు పోలింగ్ను బహిష్కరించారు.
01:06 PM (IST) Apr 11
ఉత్తమ్ను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు
నల్గొండ జిల్లా హుజుర్నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్, నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డిని స్ధానిక మాధవరాయినిగూడెంలో ఉన్న పోలింగ్ బూత్లోకి వెళ్లనీయకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
01:02 PM (IST) Apr 11
12 గంటల వరకు 22.84 శాతం పోలింగ్
రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 22.84 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు.
12:29 PM (IST) Apr 11
ఓటు హక్కు వినియోగించుకున్న రేణుకా చౌదరి
టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం అభ్యర్ధి రేణుకా చౌదరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
12:05 PM (IST) Apr 11
ఉపాసన తల్లి శోభన కామినేని ఓటు గల్లంతు
హీరో రామ్చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని ఓటు గల్లంతయ్యింది. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆమె ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు వెళ్లారు.. జాబితాలో ఆమె పరిశీలించిన అధికారులు ఓటు గల్లంతైనట్లుగా చెప్పడంతో శోభన అక్కడి నుంచి వెనుదిరిగారు.
12:01 PM (IST) Apr 11
ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల
మంత్రి ఈటల రాజేందర్ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
11:43 AM (IST) Apr 11
అంబులెన్స్లో వచ్చి ఓటేసిన ముఖేశ్ గౌడ్
అనారోగ్యంతో బాధపడుతూ కూడా పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చారు మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అబిడ్స్ పోస్ట్ ఆఫీసులో ఉన్న పోలింగ్ కేంద్రానికి అంబులెన్స్లో వెళ్లి ఓటేశారు.
11:35 AM (IST) Apr 11
ఓటు హక్కు వినియోగించుకున్న గవర్నర్ దంపతులు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమాజిగూడ ఎంఎస్ మక్తా అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గవర్నర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
11:22 AM (IST) Apr 11
చింతమడకలో ఓటేసిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామంలో చింతమడకలోని పోలింగ్ బూత్లో ఆయన భార్య శోభతో కలిసి ఓటు వేశారు. సీఎంకు ఎమ్మెల్యే హరీశ్ రావు, అధికారులు స్వాగతం పలికారు.
11:18 AM (IST) Apr 11
ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్లోని నందినగర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో కేటీఆర్ ఓటేశారు.
10:31 AM (IST) Apr 11
9 గంటల వరకు 10.6 శాతం పోలింగ్ నమోదు
లోక్సభ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.6 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
10:22 AM (IST) Apr 11
అశ్వారావుపేటలో ఆందోళనకు దిగిన ఓటర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బూత్ ఏజెంట్లు లేటుగా రావడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. దీంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.
10:20 AM (IST) Apr 11
కొత్తగూడెంలో ఎన్నికల బహిష్కరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామస్తులు ఎన్నికల పోలింగ్ను బహిష్కరించారు. కలెక్టర్ వచ్చి పోడు భూముల పట్టా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓటింగ్లో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు.