మొన్న నామా.. నేడు సండ్ర.. ఇంకా ‘సైకిల్’ ని మర్చిపోలేదు
తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఒకరు, ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా... చాలా మంది నేతలు కారు ఎక్కేశారు. అయితే.. అలా పార్టీ మారినప్పటికీ.. కొందరు నేతలు తమ పాత పార్టీ గుర్తును ఇంకా మర్చిపోయినట్లు లేరు.
తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఒకరు, ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా... చాలా మంది నేతలు కారు ఎక్కేశారు. అయితే.. అలా పార్టీ మారినప్పటికీ.. కొందరు నేతలు తమ పాత పార్టీ గుర్తును ఇంకా మర్చిపోయినట్లు లేరు. ఎన్నికల ప్రచారంలో కారు గుర్తుకు ఓటు వేయమని అడగాల్సింది పోయి.. సైకిల్ గుర్తుకు ఓటు వేయమని కోరుతున్నారు.
మొన్నటికి మొన్న నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ టంగ్ స్లిప్ అయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ వచ్చి.. ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరారు. అయితే.. పాత అలవాటులో పొరపాటుగా.. ప్రస్తుత పార్టీ గుర్తుకు బదులుగా.. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
తాజాగా.. సండ్ర కూడా నామా బాటలోనే నడిచారు. ‘సైకిల్ గుర్తుకు ఓటేయండి’ అని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన ఆయన నామా నాగేశ్వరరావు తరఫున సండ్ర కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నారు.
సోమవారం మాజీ మంత్రి తుమ్మలతో కలిసి కల్లూరులో రోడ్ షోలో పాల్గొన్న సండ్ర.. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలన్నారు. పొరపాటును గుర్తించి వెంటనే నాలుక్కరుచుకుని కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. తర్వాత మాజీ మంత్రి తుమ్మల మైకు తీసుకొని సండ్ర తడబాటును సరిదిద్దే ప్రయత్నం చేశారు. కారు గుర్తుపై ఓటు వేయాలని చెబుతూ ప్రజలతో నినాదాలు చేయించారు.