నాకేం ప్రధాని కావాలని లేదు, కానీ...: కేసీఆర్
తనకు ప్రధానమంత్రి పదవి కావాలనే కోరిక లేదని కేసీఆర్ ప్రకటించారు. కానీ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
వరంగల్: తనకు ప్రధానమంత్రి పదవి కావాలనే కోరిక లేదని కేసీఆర్ ప్రకటించారు. కానీ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం నాడు వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు.ఆజాంజాహీ మిల్లు గ్రౌండ్స్లో సభలు పెట్టినవారంతా ప్రధానమంత్రులైన విషయాన్ని దయాకర్ రావు గుర్తు చేశారని కేసీఆర్ చెప్పారు.తనకు ఈ పదవి విషయంలో ఆశ లేదన్నారు.
70 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని అత్యధికంగా పాలించాయని ఆయన గుర్తు చేశారు. అయినా దేశంలో ఎలాంటి మార్పులు రాలేదని కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం తన వద్ద పెట్టుకొందని కేసీఆర్ విమర్శించారు. వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలంటే ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. సర్పంచ్ స్థాయి కంటే తక్కువ స్థాయికి దిగజారి మోడీ మాట్లాడుతున్నారని కేసీఆర్ విమర్శించారు.
తెలంగాణకు రూ.35 వేల కోట్లు ఇచ్చినట్టుగా మోడీ ప్రకటించారు. కానీ, కేంద్రానికి లక్షకోట్లను పన్నుల రూపంలో ఇస్తే ముష్టేసినట్టుగా కేంద్రం రూ. 35 వేల కోట్లను ఇచ్చిందని ఆయన చెప్పారు.
ఐదేళ్లకు ముందు తెలంగాణ ఎలా ఉండేది, ఇప్పుడు తెలంగాణ ఎలా ఉండేదో మీకు తెలుసునని ఆయన చెప్పారు.దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన చెప్పారు.
కొత్త రెవిన్యూ చట్టం ద్వారా అనేక మార్పులు తీసుకురానున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. భూముల రికార్డుల కోసం ఎవరికీ కూడ లంచాలు ఇవ్వకూడదని ఆయన కోరారు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే మనకు ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ రాష్ట్రాల హక్కుల సాధ్యమౌతాయన్నారు.