పోలింగ్ రోజు సెలవు.. ఇవ్వకపోతే చర్యలు..దాన కిశోర్
ఈ నెల 11వ తేదీ అంటే రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.
ఈ నెల 11వ తేదీ అంటే రేపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. సెలవు ప్రకటించని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం. దానకిశోర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
పోలింగ్ రోజు సెలవు ఇవ్వడంతోపాటు..ఉద్యోగులకు ఆ రోజు జీతం కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలపై ప్రజాప్రాతినిధ్యచట్టం 1951 సెక్షన్ 135(బి)తో పాటు కార్మిక చట్టాలను అనుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ కొన్ని సంస్థలు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదుల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగులను ఓటింగ్లో పాల్గొనకుండా చేయడం నిబంధనలకు అతిక్రమించడమేనని వెల్లడించారు.