బాంచెన్ దొర అందామా...ఒరే దొర అందామా: కేసీఆర్ పై విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు
ప్రస్తుతం అదే దొరపై యుద్ధం చేయబోతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను వంచించారని ధ్వజమెత్తారు. బాంచెన్ దొర అందామా.. ఒరేయ్ దొర అందామా అనేది ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
పెద్దపల్లి : తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి. దొరల తెలంగాణ వద్దని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే తెలంగాణ కావాలని ఆమె స్పష్టం చేశారు.
టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షురాలు, సినీనటి విజయశాంతి అన్నారు. బుధవారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. గతంలో తాను దొర కేసీఆర్ కలిసి తెలంగాణ కోసం ఉద్యమం చేశామని గుర్తు చేశారు.
ప్రస్తుతం అదే దొరపై యుద్ధం చేయబోతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను వంచించారని ధ్వజమెత్తారు. బాంచెన్ దొర అందామా.. ఒరేయ్ దొర అందామా అనేది ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని చెప్తున్న కేసీఆర్, అప్పుడు ఎంపీగా ఉన్న తన పేరు ఎందుకు ఎత్తడం లేదని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు.
కేసీఆర్ ఎవరికి ఏజెంట్లుగా వ్యవహరించారో, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో లోక్సభ ఎన్నికల తర్వాత తేలుతుందని విజయశాంతి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లతో తగిన బుద్ది చెప్పాలని విజయశాంతి పిలుపునిచ్చారు.