నీది కుటుంబ పార్టీ కాదా: కేసీఆర్పై అమిత్ షా వ్యాఖ్యలు
నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అవుతారన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అవుతారన్నారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ఇక్కడ టీఆర్ఎస్ కుటుంబ పార్టీలని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్లో తల్లి, కొడుకు, కూతురు రాజకీయాలు చేస్తుంటే.. ఇక్కడ తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడు రాజకీయాలు నడుపుతున్నారని అమిత్ షా దుయ్యబట్టారు. హైదరాబాద్ మెట్రో కోసం కేంద్రప్రభుత్వం నిధులు కేటాయించిందని అమిత్ షా గుర్తు చేశారు.
వరంగల్, కరీంనగర్లను స్మార్ట్ సిటీలుగా మార్చామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఏం చేయలేదని.. కానీ బీజేపీ సర్కార్ 16 వేల 500 కోట్లు కేటాయించిందని అమిత్ షా దుయ్యబట్టారు. ఇవి ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
16 స్థానాల్లో తమను గెలిపించాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారని.. ఆ సీట్లతో కేసీఆర్ ప్రధాని కాగలుగుతారని అని అమిత్ షా ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినం జరిపే ధైర్యం కేసీఆర్కు ఉందా..? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సీఎం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
మంచి మెజారిటీతో గెలిచి కూడా రెండు నెలల పాటు మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారని అమిత్ షా మండిపడ్డారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రధాని కావాలని కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కోరుతోంది.. మరి ఈ డిమాండ్ను రాహుల్ గాంధీ సమర్థిస్తారా అని అమిత్ షా ప్రశ్నించారు.
పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశానికి ఏమీ చేయలేకపోయిందని మాల్యా వంటి వారు యూపీఏ హయాంలోనే భారీగా బ్యాంక్ రుణాలు తీసుకున్నారని షా వ్యాఖ్యానించారు.