మా నాన్న ధ్యాన్చంద్ ను మన్మోహన్ ప్రభుత్వం అవమానించింది: అశోక్
జాతీయ క్రీడా దినోత్సవం రోజున ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కు భారత రత్న దక్కకపోవవడం మరోసారి చర్చ జరిగింది. తన తండ్రికి భారతరత్న ఇస్తామని చెప్పి గత యూపీఏ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అశోక్ కుమార్ బయటపెట్టాడు.
ధ్యాన్ చంద్... భారత దేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో ఒకరు. భారత జాతీయ క్రీడ హాకీని ప్రపంచ స్థాయి క్రీడగా మారిందంటే అది ఇతడిచలవే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ కు ఏకంగా మూడు గోల్డ్ మెడల్స్ అందించిన ఏకైక కెప్టెన్ అతడు. ఇంతటి గొప్ప క్రీడాకారుడిని గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్న సమయంలో తీవ్ర అవమానం జరిగిందట. ఈ విషయాన్ని తాజాగా ధ్యాన్ చంద్ తనయుడు అశోక్ కుమార్ వెల్లడించాడు.
తన తండ్రి ధ్యాన్ చంద్ పుట్టినరోజు(ఆగస్ట్ 29), జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రికి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇప్పటివరకు లభించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం క్రీడల్లో భారత్ దూసుకెళుతుందంటే అందుకు గతంలో ఆయన వేసిన పునాదులే కారణం. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ సమాజం ముందు మరింత పెంచిన ఆయన ఈ అత్యున్నత పురస్కారానికి అన్ని విధాలా అర్హుడని అశోక్ పేర్కొన్నాడు.
అయితే కేంద్ర ప్రభుత్వం స్వచ్చందంగా ఆయనకు భారత రత్న అవార్డును అందించాలి. అలాకాకుండా పైరవీల ద్వారా మా తండ్రిపేరు ఆ అవార్డుకు ఎంపికయ్యేలా చేయాలని తాను భావించడంలేదు. నేనలా చేస్తే ధ్యాన్ చంద్ గౌరవం పెరగడం కాదు తగ్గించివాడినవుతా అని అన్నాడు.
''గతంలో యూపీఏ ప్రభుత్వం మా తండ్రిని ఘోరంగా అవమానించింది. ధ్యాన్ చంద్ కు భారత రత్న అవార్డు అందించనున్నట్లు తమకు తెలియజేసి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ ఫైల్ పై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సంతకం చేశారు. చివరి నిమిషంలో ఏమైందో తెలీదు కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకుని అవమానకరంగా వ్యవహరించారు.'' అశోక్ గుర్తుచేసుకున్నారు.
అప్పటినుండి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని అడగడం మానేశాం. మేం యాచించకుండా ప్రభుత్వమే ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించాలని కోరుకుంటున్నాం. భవిష్యత్ లో అలాంటి నిర్ణయాలుంటాయన్న ఆశతో తమ కుటుంబం వుందని ధ్యాన్ చంద్ తనయుడు అశోక్ కుమార్ వెల్లడించాడు.