T20 World Cup 2024 : అథ్లెటిక్స్ ఉసేన్ బోల్ట్ కొద్ది రోజుల క్రితం టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్‌ను కూడా అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 

Yuvraj Singh : మెగా క్రికెట్ టోర్న‌మెంట్ ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 కోసం వివిధ దేశాలు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఐసీసీ ఈ ఈవెంట్ కోసం ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ అంబాసిడర్‌గా యువరాజ్‌ సింగ్‌ నియమితులయ్యారు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు హీరోల్లో ఈ ఆల్‌రౌండర్‌ ఒకరు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో ఏకంగా 6 సిక్స‌ర్లు బాది చ‌రిత్ర సృష్టించాడు. ఈసారి టీ20 ప్రపంచకప్‌ను ప్రమోట్ చేస్తున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టీ20 ప్రపంచకప్ జూన్ 1న ప్రారంభం కానుంది. అంతకంటే ముందు అమెరికాలో జరిగే పలు ప్రచార కార్యక్రమాలకు యువరాజ్ హాజరుకానున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌ టెక్సాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ స్టేడియంలో జరగనుంది. ఆతిథ్య జట్టులో ఒకటైన యునైటెడ్ స్టేట్స్ ప్రారంభ మ్యాచ్‌లో పొరుగున ఉన్న కెనడాతో తలపడుతుంది. టీ20 ప్రపంచకప్ జూన్ 29 వరకు కొనసాగనుంది. ఫైనల్ మ్యాచ్ బార్బడోస్‌లో జరగనుంది. ఈ టోర్నీలో 20 జట్లు ఆడుతున్నాయి. 9 స్టేడియాల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.

యంగ్ అండ్ సీనియర్ స్టార్ ప్లేయ‌ర్ల‌తో భార‌త జ‌ట్టు.. టీ20 వరల్డ్ కప్ 2024 మ‌న‌దే ఇక.. !

టీ20 ప్రపంచకప్ అంబాసిడర్ నియ‌మితులైన త‌ర్వాత యువరాజ్ మాట్లాడుతూ, 'టీ20 ప్రపంచకప్‌లో ఆడినందుకు నాకు కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. 1 ఓవర్‌లో 6 సిక్స‌ర్లు కొట్టిన జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో జతకట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సంఖ్యలో జట్లు పాల్గొంటున్నాయి . వెస్టిండీస్ క్రికెట్ ఆడేందుకు గొప్ప ప్రదేశం. సందర్శకులు ప్రపంచంలో మరెక్కడా లేని వాతావరణాన్ని సృష్టిస్తారు. అమెరికాలో కూడా క్రికెట్ విస్తరిస్తోంది. టీ20 ప్రపంచకప్ ద్వారా క్రికెట్ అభివృద్ధికి సహకరించినందుకు నేను సంతోషిస్తున్నాను' అని పేర్కొన్నాడు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై యువరాజ్ ఉత్సాహం.. 

జూన్ 9న న్యూయార్క్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గురించి యువరాజ్ మాట్లాడుతూ, 'న్యూయార్క్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఈ ఏడాది ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడా ఈవెంట్‌లలో ఒకటిగా నిలుస్తుంది. కొత్త స్టేడియంలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ల ఆటను చూసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను' అని అన్నాడు.

T20 WC INDIA SQUAD : స్టార్ ప్లేయర్లకు షాకిచ్చిన బీసీసీఐ.. టాప్-5 అన్‌లక్కీ ప్లేయ‌ర్లు వీరే..