రెండు రోజులకే దెబ్బతిన్న కోహ్లీ మైనపు విగ్రహం
అభిమానుల అత్యుత్సాహమే కారణమా
దేశ రాజధాని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తాజాగా ఏర్పాటు చేసిన కోహ్లీ మైనపు విగ్రహం దెబ్బతిన్నది. సెలబ్రెటీలను అచ్చుగుద్దినట్లు మైనపు విగ్రహాలను తయారు చేయడంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి సాటి లేదు. కాగా.. ఇటీవల టీంఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని కూడా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. కాగా.. కోహ్లీ మైనపు బొమ్మను వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అంతేకాదు.. ఆ విగ్రహంతో పోటీపడి మరి సెల్ఫీలు దిగారు.
ఈ క్రమంలో కోహ్లీ కుడి చెవి పైభాగం పాక్షికంగా దెబ్బతింది. వెంటనే గమనించిన మ్యూజియం నిర్వాహకులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు. చెవి భాగానికి సంబంధించిన కొలతలను నిపుణులకు పంపించారు. వీలైనంత త్వరగా దాన్ని తయారు చేసి పంపాల్సిందిగా కోరినట్లు సమాచారం. దెబ్బతిన్న కోహ్లీ మైనపు విగ్రహం ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. స్థానిక వార్తాపత్రికల్లో గురువారమే ఇందుకు సంబంధించి వార్తలు వెలువడ్డాయి.
టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన మూడో భారత క్రికెటర్ విగ్రహం కోహ్లీది. గతంలో కపిల్ దేవ్, సచిన్ తెందుల్కర్ విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. త్వరలో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.