మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు... భారీ కుంభకోణాలు.. సుప్రీంకోర్టు అక్షింతలతో ఇప్పటికే భారత క్రికెట్ పరువు గంగపాలైంది.. తాజాగా జట్టులో స్థానం కావాలంటే అమ్మాయిలు, డబ్బు పంపాల్సిందేనంటూ ఓ క్రికెటర్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు... భారీ కుంభకోణాలు.. సుప్రీంకోర్టు అక్షింతలతో ఇప్పటికే భారత క్రికెట్ పరువు గంగపాలైంది.. తాజాగా జట్టులో స్థానం కావాలంటే అమ్మాయిలు, డబ్బు పంపాల్సిందేనంటూ ఓ క్రికెటర్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ శర్మ అనే క్రికెటర్ జట్టులోకి తనను ఎంపిక చేయాలంటే డబ్బుకు బదులు.. అమ్మాయిలను పంపాలని ఆదేశించాడని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా సహాయకుడు మొహమ్మద్ అక్రమ్ సైఫీపై ఆరోపణలు చేశాడు.. అంతేకాకుండా ఆటగాళ్ల వయసుకు సంబంధించి అక్రమ్ నకిలీ సర్టిఫికెట్లను జారీ చేసేవాడని.. ఆ తర్వాత వారిని ఆయా టోర్నీలకు ఎంపిక చేయించేవాడని రాహుల్ ఆరోపించారు.

ఇందుకు సంబంధించి తనకు అక్రమ్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను మీడియాకు అందజేశాడు.. దానిని సదరు ఛానెల్ బయటపెట్టడంతో ఈ వ్యవహారం ఇప్పుడు బీసీసీఐలో కలకలం రేపుతోంది. ఆ ఆడియో టేపులో ‘‘ఉత్తరప్రదేశ్‌ క్రికెట్ అసోసియేషన్ లో చాలామంది పెద్దలున్నారు.. వాళ్లందరినీ ఒప్పించాలంటే ఢిల్లీలో ఉన్న పెద్దలకు అమ్మాయిలను పంపాలని’’ శర్మను అక్రమ్ అడిగినట్లుగా వినిపిస్తోంది..

కాగా తనపై వస్తున్న ఆరోపణలు మొహమ్మద్ అక్రమ్ ఖండించారు.. అవన్నీ నిరాధారామైన ఆరోపణలని.. కొందరు ఆటగాళ్లు అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.. వాళ్లు చెప్పిన లెక్క ప్రకారం నేను అమ్మాయిలను పంపించమని అడిగివుంటే.. అదే నిజమైతే వారు యూపీ జట్టులో సభ్యులుగా ఉండాలి కదా..? అని ఆయన ప్రశ్నించారు. నాకు ఎప్పుడు రాహుల్ శర్మ అన్న పేరు లిస్ట్‌లో కనిపించలేదని పేర్కొన్నారు.

దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తీవ్రంగా స్పందించింది.. బీసీసీఐలోని యాంటీ కరప్షన్ యూనిట్ శర్మ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.