చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీం ఇండియా ఘన విజయం : చెలరేగిన బౌలర్లు
ఆసియాకప్ టీ20 ఫైనల్ కి టీం ఇండియా
ఆసియా కప్ టీ20 టోర్నీలో మహిళా జట్టు విజయపరంపర కొనసాగుతోంది. వరుస విజయాలతో టీం ఇండియా ఆసియాకప్ ఫైనల్ కి చేరింది. అదీ అషామాషీగా కాదు... చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను మట్టికరిపించి మరీ ఫైనల్ లోకి ప్రవేశించింది. శనివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంబించి చాలా తక్కువ పరుగులకే పాక్ ను కట్టడి చేశారు. ఆ తర్వాత కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే అద్భుత విజయాన్ని సాధించారు.
టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు వ్యూహం ఫలించలేదు. భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ బ్యాట్స్ ఉమెన్స్ పరుగులు సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 72 పరుగుల సాధించి 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీం ఇండియా ముందుంచింది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ తన అద్భుత ఫామ్ ను కొనసాగిస్తూ నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.
ఇక స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో బారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మిధాలీరాజ్, దీప్తి శర్మ లు పరుగులేమీ సాధించకుండానే డకైట్ అయ్యారు. దీంతో అభిమానులల్లో ఒకింత ఉత్కంట చెలరేగింది. అయితే స్మృతీ మంధాన(38), హర్మన్ప్రీత్ కౌర్(34 నాటౌట్) గా రాణించడంతో భారత జట్టు అధ్బుత విజయాన్ని అందుకుంది.
చావో రేవో తేల్చుకోవాల్సిన సెమి ఫైనల్ లో సమిష్టిగా రాణించిన టీం ఇండియా ఫైనల్ కి చేరింది. ఇక తుది పోరులో హర్మన్ప్రీత్ సారధ్యంలోని మహిళా జట్టు విజయం సాధిస్తే ఆసియా కప్ టీం ఇండియాదే.