అండర్ 19 జట్టులో అర్జున్ టెండూల్కర్ : అభినందించిన సచిన్ దంపతులు
ఎంపికచేసిన సెలక్షన్ కమిటీ
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా క్రికెట్ లో అడుగుపెట్టిన అర్జున్ టెండూల్కర్ మరో అడుగు ముందుకేశాడు. ఇప్పటివరకు అండర్ 14, అండర్ 16 జట్టులో ఆడిన అర్జున్ తాజాగా అండర్ 19 లో అడుగుపెట్టాడు. వచ్చేనెల జూలైలో శ్రీలంకతో జరగనున్న అండర్-19 సిరీస్లో అర్జున్ టెండూల్కర్ భారత జట్టు తరపున ఆడనున్నాడు. శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్లో భాగంగా భారత అండర్-19 జట్టు యువ వికెట్ కీపర్ ఆర్యన్ జయాల్ కెప్టెన్సీలో రెండు ఫోర్ డే మ్యాచులు, ఐదు వన్డే మ్యాచులు ఆడనుంది.
అర్జున్ అండర్ 19లో భారత క్రికెట్ జట్టుకు ఎంపికవడంతో తాను, భార్య అంజలి ఎంతో సంతోషించామని సంచిన్ చెప్పారు. అర్జున్ ఇలా క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక విజయాలు అందుకోవాలని దేవుడిని ప్రార్థించామన్నారు. అర్జున్ అంకితబావంతో క్రికెట్ లో మెలకువలు నేర్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడని, అప్పుడప్పుడు తన సలహాలు కూడా తీసుకుంటాడని సచిన్ తెలిపాడు.
ఇక అండర్ 19 లో జట్టులో స్థానం సంపాదించిన సచిన్ తనయుడు అర్జున్ ని ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అభినందించారు. ముంబై తరపున అండర్ 14, అండర్ 16, అండర్ 18 క్రికెట్ జట్టులో ఆడిన అర్జున్ మంచి ప్రతిభతో అండర్ 19 జట్టులో స్థానం సంపాదించాడని అన్నారు. అర్జున్ తన తండ్రి బాటలో నడిచి భారత్ కు అనేక విజయాలు సాధించిపెట్టాలని ఆశిస్తున్నట్లు శుక్లా తెలిపాడు.