రెండు మ్యాచ్లు రెండొకట్లు.. ఆఖరి నిముషంలో అద్భుతాలు
రెండు మ్యాచ్లు రెండొకట్లు.. ఆఖరి నిముషంలో అద్భుతాలు
హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్లో భాగంగా శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా జరిగిన రెండు మ్యాచ్లు ఇరాన్, ఉరుగ్వే టీమ్లు అనూహ్యమైన రీతిలో గోల్ సంపాదించి పెట్టాయి. చెరో 3 పాయింట్లు తెచ్చి పెట్టాయి. ముందుగా చెప్పుకోవాల్సింది గ్రూప్-బి మ్యాచ్లలో భాగంగా మొరాకో, ఇరాన్ మధ్య సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన మ్యాచ్. 20 సంవత్సరాల గ్యాప్ తర్వాత అంటే 1998లో ప్రాన్సులో వరల్డ్ కప్ ఆడిన తర్వాత మొరాకో పాల్గొంటున్న వరల్డ్ కప్ టోర్న్మెంట్ ఇదే. మొదటి మ్యాచ్ గెలిస్తే టీమ్లో ఉన్న యువ రక్తంలో మరింత ఉత్సాహం నింపవచ్చనే ఆశతో ఉంది.
ఏషియన్ జెయింట్స్గా పేరున్న ఇరాన్ జట్టు వరుసగా రెండోసారి వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఆడుతోంది. ఈ మ్యాచ్ కనుక గెలిస్తే స్పెయిన్, పోర్చుగల్ లాంటి హేమాహేమీలున్న గ్రూప్-బిలో గెలుపొందిన జట్టు పేరు తెచ్చుకుంటుంది.ఇంతటి ఆశలతో కొనసాగిన మ్యాచ్ ఇక ఐదు నిముషాల్లో ముగుస్తుందనగా మొరాకో ప్లేయర్ అజిజ్ బొహడ్డువాజ్ చేసిన సెల్ఫ్ గోల్ 1-0 తో ఇరాన్కు విజయాన్ని అందించింది. 0-0 తో డ్రాగా ముగియాల్సిన గేమ్ను అజిజ్ చేజేతులా నాశనం చేసుకున్నాడు. ఎహ్సాన్ హజ్సఫీ కొట్టిన బాల్ను గోల్ చేయాలనే ఉద్దేశ్యంతో అజిజ్ దాని రూట్ మార్చడానికి ప్రయత్నించాడు. కానీ అది కాస్త సెల్ఫ్ గోల్ అయ్యింది. ఊహించని పరిణామానికి మొరాకో టీమ్ కన్నీటి పర్యంతమైపోతే, ఇరాన్ టీమ్ సంబరాలు చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అమైన్ హ్యారిట్ నిలిచాడు. ఇరాన్ ఖాతాలో 3 పాయింట్లు చేరాయి.
ఈజిప్ట్, ఉరుగ్వే మ్యాచ్ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ అంతా ఎలాంటి గోల్స్ లేకుండా సాగింది. సెకండాఫ్కు వచ్చేసరికి 89వ నిముషంలో జోస్ గిమెనెజ్ చేసిన గోల్ 1-0 తో ఉరుగ్వేకు విజయం తెచ్చిపెట్టింది. ఆఖరి నిముషంలో చోటు చేసుకున్న ఉత్పాతానికి ఈజిప్టు టీమ్కు గుండె పగిలినంత పనైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మొహమ్మద్ ఎల్షనావి నిలిచాడు. ఉరుగ్వే ఖాతాలో 3 పాయింట్లు పడ్డాయి.