ఆఫ్ఘనిస్థాన్ Vs ఇండియా టెస్ట్: శిఖర్ థావన్ సెంచరీ, వర్షంతో ఆట నిలిపివేత
ఆప్ఘనిస్థాన్ తో టెస్ట్ మ్యాచ్
బెంగుళూరు: ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ థావన్ గురువారం నాడు సెంచరీ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది భారత్. భారత ఓపెనర్లు శిఖర్ థావన్, మురళీ విజయ్ లు నిలకడగా రాణించారు.
భోజన విరామ సమయానికి ఓపెనర్ శిఖర్ థావన్ సెంచరీ పూర్తి చేశారు. లంచ్ సమయానికి భారత్ జట్టు 150 పరుగులు చేసింది. 91 బంతుల్లో శిఖర్ థావన్ సెంచరీ పూర్తి చేశారు. మరో ఓపెనర్ మురళీ విజయ్ లంచ్ విరామానికి 41 రన్స్ చేశారు. విరాట్ కోహ్లి స్థానంలో రహానే భారత్ జట్టుకు కెప్టెన్ గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
బెంగుళూరులో ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ రహానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మురళీ విజయ్, శిఖర్ ధావన్ లు ఆఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి వికెట్ కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
96 బంతులను ఎదుర్కొన్న ధావన్ 3 సిక్సర్లు, 19 ఫోర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. చివరకు యమిన్ అహ్మద్ జాయ్ బౌలింగ్ లో మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ లో మరెవరూ సాదించలేని ఘనతను సాధించాడు. ఒక టెస్టు మ్యాచ్ ఓపెనింగ్ రోజు లంచ్ సమయానికంటే ముందే సెంచరీ కొట్టిన ఏకైక భారత బ్యాట్స్ మెన్ గా ధావన్ అవతరించాడు. లంచ్ విరామానికి ధావన్ 104 పరుగులు సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సెహ్వాగ్ పేరిట ఉంది. 2006లో సెయింట్ లూసియాలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో వీరూ 99 పరుగులు చేశాడు.
ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. 48.4 ఓవర్లలో ఇండియా ఒక్క వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. మధ్యాహ్నం వర్షం కారణంగా ఆటను నిలిపివేశారు.