Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ ఓడిపోవడం బాధాకరమే, గబ్బర్ ఈస్ ఆల్వేస్: శిఖర్ ధావన్

ఢిల్లీ డేర్ డెవిల్స్ ను మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు.

Gababr is always: Shikhar Dhawan

న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్ డెవిల్స్ ను మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. తమపై ఢిల్లీ ఓడిపోవడం బాధాకరమేనని అన్నారు. గురువారంనాడు జరిగిన మ్యాచులో కేన్ విలియమ్సన్ తో కలిసి శిఖర్ ధావన్ అద్భుతంగా ఆడి జట్టుకు ఘన విజయం సాధించి పెట్టాడు. 

కేవలం 50 బంతుల్లో 92 పరుగులు చేసిన ధావన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు. ఈ విజయంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అది ఆనందమే అయినా ఢిల్లీ ఓటమి కాస్తా బాధ కలిగించిందని అన్నాడు. 

అద్భుతంగా ఆడారు, గబ్బర్ ఈస్ బ్యాక్ అనుకోవచ్చా అని వ్యాఖ్యాత అంటే తిరిగి రావడం కాదు, గబ్బర్ ఈస్ ఆల్వేస్ అని శిఖర్ ధావన్ అన్నాడు. తాను తన స్టైల్లో రెచ్చిపోయానని, కేన్ విలియమ్సన్ తన శైలిలో ఆదడాడని అన్నాడు. బ్యాటింగ్ కు దిగే ముందు కోచ్ మూడీ ఒక్కటే మాట చెప్పాడని, అన్ని పరుగులు వాళ్లు (ఢిల్లీ) సాధించగా లేనిది మనం సాధించలేమా అని అన్నాడని చెప్పాడు.

ప్రత్యేకమైన వ్యూహాలేమీ లేకుండా తమ సహజ శైలిలో ఆడామని, ఇన్నింగ్స్ మధ్యలో కేన్, తాను పెద్దగా మాట్లాడుకున్నది కూడా లేదని అన్నాడు. 

మ్యాచ్ గెలిచింది సన్ రైజర్సే అయినా ప్రేక్షకుల మనసులను దోచుకుంది మాత్రం ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ ఇన్నింగ్సేననే అభిప్రాయంతో ధావన్ ఏకీభవించాడు. రిషబ్ లాంటి యువకుడు అద్భుతంగా ఆడడం బాగుందని, భారత క్రికెట్ కు సంబంధించి కూడా ఇది మంచి పరిణామమని అన్నాడు. 

పంత్ చెలరేగి ఆడినా చివరికి ఢిల్లీ ఓడిపోవడం ఒకింత బాధ కలిగించిందని, వారు ఇంకా ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండింది కావచ్చునని శిఖర్ ధావన్ అన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios