ధోనీ అలా చేయాల్సిందే, అతన్ని తప్పించడం ఘోరం: గంగూలీ
మిడిల్ ఆర్డర్ లో భారత్ ప్రయోగాలు కొనసాగించడం వల్ల జరుగుతున్న వైఫల్యం పట్ల భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
న్యూఢిల్లీ: మిడిల్ ఆర్డర్ లో భారత్ ప్రయోగాలు కొనసాగించడం వల్ల జరుగుతున్న వైఫల్యం పట్ల భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చే ప్రపంచ కప్ జట్టులో ఎంఎస్ ధోని ఉండాలని యాజమాన్యం భావిస్తే అతను ఆటతీరు మార్చుకోక తప్పదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
ఏడాదిగా పరిమిత ఓవర్లలో ధోని రాణించలేకపోవడాన్ని గంగూలీ ఆయన గుర్తు చేశాడు. 2019 ప్రపంచ కప్లోనూ ఎంఎస్ ధోని ఆడాలని మేనేజ్మెంట్ అనుకుంటే అతడు సత్తా చూపే స్థానంలోనే ఆడించాలని అన్నాడు. 24-25 ఓవర్లలో ఇన్నింగ్స్ను నిర్మించాల్సిన తరుణంలో అతడు విఫలమవుతున్నాడని అన్నాడు.
ధోని గొప్ప బ్యాట్స్మనే కానీ ఏడాదిగా అతడు రాణించలేకపోతున్నాడని, ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఆటలో లోపాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని గంగూలీ వ్యాఖ్యానించాడు.
కేఎల్ రాహుల్, అజింక్యా రహానేలను జట్టు ఉపయోగించుకోవడం లేదని ఆయన అన్నాడు. ఇకనైనా వాళ్లకు సరైన అవకాశాలు అవకాశాలు కల్పించాలని అన్నాడు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీదనే ఎక్కువ ఆధారపడుతుండడాన్ని ఆయన తప్పు పట్టాడు.
ఇంగ్లాండుతో జరిగిన మూడో వన్డేలో కెఎల్ రాహుల్ చేత ఆడించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. రహనే, రాహుల్ చేత ఆడించకపోవడం కావాలని చేస్తోందని తాను అనడం లేదని, నాలుగో స్థానంలో రాహుల్ లేదా అజింక్యా రహనేల్లో ఎవరితోనో ఒకరి చేత ఆడించకపోవడం వల్ల రోహిత్, కోహ్లీలపై భారం పడుతోందని అన్నాడు.
నీకు 15 గేమ్స్ ఇస్తాం, నీ సత్తా చాటు అని రాహుల్ కు చెప్పి నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దింపాలని అన్నాడు. రాహుల్ కు యాజమాన్యం సరైన అవకాశాలు కల్పించడం లేదని, మాంచెస్టర్ లో రాహుల్ అద్భుతమైన సెంచరీ చేశాడని, ఆ తర్వాత తప్పించారని, ఆ విధమైన ఆటగాడ్ని తయారు చేయలేమని, రహనే విషయంలో కూడా అదే వర్తిస్తుందని అన్నాడు.