సారాంశం

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా కాంపౌండ్‌ ఓపెన్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్‌లో భారత్‌ స్వర్ణం సొంతం చేసుకుంది.

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా కాంపౌండ్‌ ఓపెన్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్‌లో భారత్‌ స్వర్ణం సొంతం చేసుకుంది. భారత్‌ అథ్లెట్లు రాకేష్ కుమార్, శీతల్ దేవిలు..  151-149తో చైనాకు చెందిన యుషాన్ లిన్, జిన్లియాంగ్ ఐలపై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకున్నారు. దీంతో పారా ఆసియా గేమ్స్‌లో భారత్ స్వర్ణాల సంఖ్య 18కి చేరింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పారా ఆసియా గేమ్స్‌లో భారత్‌కు  అర్చరీ విభాగంలో ఇదే తొలి స్వర్ణం. 

ఇదిలాఉంటే, ఈరోజు మిక్స్‌డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో సిద్ధార్థ బాబు 247.7 పాయింట్ల రికార్డుతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. పారిస్ పారా ఒలింపిక్స్ 2024లో బెర్త్ కూడా ఖాయం చేసుకున్నారు. 

 

ఇంకా.. పురుషుల ఎఫ్-46 షాట్‌పుట్‌లో సచిన్ సర్జేరావ్ ఖిలాడీ గురువారం భారత్‌కు బంగారు పతకాన్ని అందించారు. సచిన్ సర్జేరావ్ ఖిలాడీ 16.03 మీటర్లు నమోదు చేయడం ద్వారా రికార్డు మార్క్‌ను అధిగమించి స్వర్ణం సాధించారు. మరో భారత అథ్లెట్ రోహిత్ కుమార్ 14.56 మీటర్ల బెస్ట్ త్రోతో కాంస్యం సాధించాడు.