Asianet News TeluguAsianet News Telugu

మొహర్రం వెనక కథ ఇదీ: అమరవీరుల త్యాగాల దినం

ముస్లింలు జరుపుకునే మొహర్రం పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. అమరవీరుల త్యాగాాలను గుర్తు చేసుకుంటూ నిర్వహించుకునే పండుగ ఇది. మొహర్రం వెనక ఉన్న కథను చదవండి.

Muslims festival: Importance of Moharram
Author
Hyderabad, First Published Aug 30, 2020, 10:24 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మహమ్మదీయుల ప్రధాన పర్వ దినాలలో మొహరం ముఖ్యమైనది. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోక తప్త హృదయాలతో జరుపు కునే కార్యక్రమమే పీర్ల పండుగ మొహర్రం. ముస్లిం పంచాంగ రీత్యా అరేబియాలో సంవత్సరం యొక్క మొదటి నెల మొహరం. మొహరం పండుగ, మొహరం నెల మొదటి తేదీ నుండి పదవ తేదీ వరకు జరుపుకునేవారు. మొహరం పండుగనే ''పీర్ల పండుగ '' అని కూడా అంటారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మనిర్దేశకులు అని అర్థం. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించే వాటిని పీర్లు అని పిలుస్తారు.

'మొహరం’ అంటే పండగ దినం కాదు. ఈ రోజు అమరవీరుల త్యాగాలను స్మరించడం. ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ దాన్ని ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడవలసి వచ్చింది. ఇది అరబ్బీ కేలండర్ యొక్క మొదటి నెల. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రాచీన కాలంలో అరబ్బులు ( అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా ) ఈ కేలండర్ ను వాడేవారు.

ప్రాచీనకాలంలో ఆషూరా దినం. అనగా మొహర్రం యొక్క పదవ తేదీని అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే పది రోజులు విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు. ముస్లింలు పాల్గొని అమరవీరులకు హల్బిదా, హల్బిదా అంటూ గుండెలు బాదుకొని రక్తం చిందించే రోజు 'మొహరం' . 

మొహరం ఎందుకు చేస్తారు:- 1400 ఏళ్ల క్రితం హిజ్రీశకం 60 లో జరిగిన యదార్ధ ఘటనకు ప్రతి రూపం. మహనీయులు మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ నుండి దైవవాణి గ్రహించి దానిని దివ్యఖురానుగా గ్రంథస్తం చేశారు. ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అడుగు జాడల్లో విస్తరించింది. ఈ నేపధ్యంలో అప్పటి ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ దాన్ని ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడవలసి వచ్చింది. ఇహ లోకం కంటే పరలోకమే మేలని ప్రాణత్యాగానికైనా సిద్ధమని నిలబడ్డారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఇస్లాం సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని అని యాజిద్ బలవంతం చేసాడు.

జాలీ, కరుణ, కనికరం లేకుండా అత్యంత హేయంగా ఇమామ్ హుస్సేన్ కుటుంబసభ్యులను శత్రు సైన్యం ఇరాక్ లోని అప్పటి కార్బాల యుద్ధ మైదానంలో హతమార్చారు. రెండేళ్ళ చిన్నారిని సైతం వదలకుండా క్రూరంగా అంతమొందించారు.మొహారం నెల 10 వరోజు హాజరత్ ఇమాం హుసైన్ సైతం వీర మరణం పొందారు. ఈ త్యాగనిరతికి ప్రపంచం ఆశ్చర్య పోయింది. ఇస్లాం అంటే ప్రాణాలు, కుటుంబం బలిదానం అని, మహత్తరమైనదని తేలిపోయింది. 

దీనితో ఇస్లాం అంటే శాంతి అని ఆ మత ఆచారాలను, వాస్తవాలను తెలుసుకోవాలని ప్రపంచమంతా జిజ్ఞాస  కలిగింది. ఇస్లాం వేగంగా విస్తరించింది. ఇస్లాం పునర్జీవానికి ప్రాణం పోసిన ఆ అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహారం. అందుకే 'మోహరం' పండుగ కాదు. మహ్మద్ ప్రవక్త కుటుంబం చేసిన త్యాగాల్ని స్మరించడం. తెలుగు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది.

ఆషూరా:- ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. ముహమ్మద్ ప్రవక్త మనుమడైన హుసేన్ ఇబ్న్ అలీ, కర్బలా యుద్ధంలో అమరుడైన రోజు. ముహర్రం నెలను, "షహీద్ " ( అమరవీరుల ) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. షియా ఇస్లాంలో ఈ ముహర్రం నెల, "ఆషూరా", కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ ( శోక ప్రకటన ) జరుపుతారు. తెలంగాణలో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు. హైదరాబాద్‌ పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావా నుంచి ప్రారంభమై ఈ ఊరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, మీరాలం మండీ, దారుల్‌ షిఫాల మీదుగా కొనసాగి చాదర్‌ ఘాట్‌ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ ఊరేగింపు సాగుతుంది.

హిందూ ముస్లిం ఐక్యత:- కొన్ని ప్రాంతాలలో ఇతర మతాల వారికి ముఖ్యంగా హిందువులకు కూడా పీర్ల పండగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం. అంటే జాతీయ సమైక్యతకు ఆనాడే ఎంతటి ప్రాముఖ్య మిచ్చారో మనం అర్థం చేసు కోవచ్చు. పీర్ అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడని, డా: టి. దోణప్ప గారు కూడా తమ జానపద కళా సంపద గ్రంథంలో ఉదహరించారు. ముస్లిములలో ముఖ్యంగా దూదేకులా' వారు ఆటలమ్మ, మారెమ్మ మొదలైన హిందువుల దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎఱ్ఱెప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, బాలన్న అనే పేర్లు పెట్టుకోవటమూ అలాగే హిందువులలో కుల్లాయమ్మ, దస్తగిరి, నబీగౌడు, ఫక్కీరప్ప, మస్తాన్ రావు, లాలెమ్మ, సేకణ్ణ, సైదల్లీ, సైదులు, హుసేన్ దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవటం అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులలోనూ పరసలలోనూ పాల్గొనటం, దర్గాలకు, మసీదులకూ వెళ్ళటం, పీర్లను కొలవటం సర్వసామాన్యంగా జరిగే విషయాలు.

Follow Us:
Download App:
  • android
  • ios