Asianet News TeluguAsianet News Telugu

ధనుర్మాసం

ఈ నెలలో లక్ష్మీ నారాయణుడిని తులసీదళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు.  ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలూ, సిరిసంపదలూ వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు. 

Dhanurmasam Vaikunta Ekadasi 2020: Important Dates And Timings
Author
Hyderabad, First Published Dec 17, 2020, 2:49 PM IST

ముక్తికి మార్గం... మార్గశిరం శ్రీమన్నారాయణుడి ఆరాధనతోపాటూ పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీపూజలూ, ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు.

‘మాసానాం మార్గశీర్షాహం’ అంటాడు కృష్ణభగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్ఠమైనదనీ, ఉపయోగకరమైనదనీ అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడుతోపాటూ భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం. ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందనీ, అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేననీ చెబుతాడు కృష్ణుడు. ఈ నెలలో లక్ష్మీ నారాయణుడిని తులసీదళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు.  ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలూ, సిరిసంపదలూ వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు. 

16 డిసెంబర్-2020 బుధవారం నుండి ధనుర్మాసం ప్రారంభమైనది. ఈ మాసాన్ని ఖగోళ శాస్త్ర పరంగా పరిశీలించగా చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిర నక్షతము నందు ఉండుట వలన సౌరమాన ప్రకారం సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన రోజు నుండి మకరరాశిలోకి ప్రవేశించు వరకు గల మధ్య రోజులను అనగా సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ అందమైన సంక్రాతి ముగ్గులు వేసి ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీ దేవిరూపంగా పూలతో, పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించుతారు. 

చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఉరిగేస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రధం ముగ్గు తాడును ప్రక్క ఇంటి వారు వేసిన రధం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామంగా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు. హరి దాసులు హరిభక్తులు ఇండ్ల ముందుకు వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తలు చేస్తూ ఇంటింటికి తిరుగుతారు. సంక్రాంతి ముందర గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్తులు ఇచ్చి సత్కరిస్తారు. 

పురాణములలోను, ఆయుర్వేదాది శాస్త్రములలో చెప్పినట్లు ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండును. అందుచేతనే పులగమును గాని దధ్యోదనమును గాని దేవునుకి నివేదించి తినవలయునని నియమమును తెలియజేసారు. ఈ నెల శ్రీ మహా విష్ణువుకు ప్రీతి కరమైనది. వైష్ణవ దేవాలయములో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. " శ్రీ ఆండాళ్  పాశురాలు " చదువుతారు . బ్రాహ్మీ ముహూర్త మందు స్వామి వారికి పూజలు నిర్వహించి "కటు పొంగలి" దీనినే ముద్గలాన్నం అని పప్పుపోంగలి అని కూడ అంటారు. స్వామి వారికి నివేదన చేసిన తర్వాత భక్తులకు ప్రసాదములు పంచిపెడతారు. ఈ మాసములో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అంద చేయటం జరుగుతుంది. 

ప్రతి సంవత్సరం మార్గశిర మాసం నుండి పుష్యమాసము వరకుచలి చాల ఉదృతంగా ఉంటుంది. చలికాలంలో మన శరీరంలో రక్తలో మార్పిడి జరుగుతుంది. అందువలన ఆ సమయంలో శరీరానికి పుష్టి నిచ్ఛే ఆహారము బీదసాదాలకి అందజేయటానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది. 
విష్ణు చిత్తుడను భ్రాహ్మణుని ఏకైక పుత్రిక గోదాదీవి మంచి సౌందర్యరాశి. ఆమె తోటలోని పూలను కోసి రకరకాలైన అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దమందు తనప్రతిబింబమును చూచుకొని మురిసి పోవుచూ ఆమాలలను పదిలంగా తండ్రి కిచ్చేది. ఈ విషయము తేలియని ఆ మహా భక్తుడు శేషశయనుడు శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవారు.

ఇదే విధంగా ప్రతి రోజూ జరుగసాగింది. అయితే గోదాదేవి స్వామి వారిపై రోజు రోజుకూ ప్రేమ ఏర్పడి ఆపరాత్పురునే తన భర్తగా ఊహించుకొనేది. చివరకు ఆనంత శయనుడైన శ్రీ రంగనాథ స్వామి నే వివాహమాడ వలెనని త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకుంది. ఎప్పటివలెనే మాలలను ధరించి తన ప్రక్కనే రంగనాధ స్వామి ఉన్నట్లుగా భావించి మురిసిపోవుచుండెడిది. ఇలాగే ఎల్లకాలం జరుగదుగా ఒక రోజు పూజార్లు ఆ మాలలను అలంకరించు సమయమందు ఆమాలలో దాగిఉన్న ఒక పొడవాటి వెంట్రుకను ఉన్నది గమనించారు. అది స్త్రీ వెంట్రుకని తెలుసు కున్నారు. 

ఆమాలలను తెచ్చిన ఆమహాభక్తుని నానాదుర్భాషలాడారు. అప్పుడు విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికి వెళ్ళగా అక్కడ మాలలను అలంకరించుకుని స్వామి వారితో మాట్లాడుతున్న తన కూతురుని చూసి అమితమైన ఆగ్రహముతో నిందించి పక్కనే ఉన్నకత్తితో చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతమును తండ్రికి తెలియజేసింది. తండి తన కూతురు మాటలు విశ్వసించక  అబద్దమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్యరూపుడుగా ఉన్న స్వామి ప్ర త్యక్షమై ఆమెదెంత మాత్రమూ తప్పులేదని ఆమె ధరించిన మాలలే తనకత్యంత ఇష్టమని తెలియజేసి ఆందరి సమక్షములో శ్రీ రంగనాథస్వామి  గోదాదేవిని వివాహమాడాడు.


మానవ స్త్రీ సాక్షత్తు దేవున్ని తన భక్తి శ్రద్ధలతో మెప్పించి చివరకు వివాహం ఆడేవరకు వదలలేదు. నిష్ట కలిగిన భక్తికి భవవంతుడు తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు. నాటి నుండి గోదాదేవిని  ఆండాళ్ గా పిలువ బడసాగింది. ఆండాళ్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు.
విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలు"ఆముక్త మాల్యద"అను పేరున "విష్ణు చిత్తియం అనిగూడ అందురు" గ్రంధ రచన గావించెను. ఆముక్తమాల్యద అనగా 'తీసి వేసినదండ 'అని అర్థము.

ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి "ముక్కోటి ఏకాదశి" వస్తుంది. ఆరోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనమున స్వామి వారిని తులసి మాలల అలంకరణతో దర్శించి తరిస్తారు. ఈ నెల రోజులులు వైష్ణవ దేవాలయాలు కళకళలాడుతూ కనిపిస్తాయి, ఉదయం, సాయంత్ర సమయాలలో స్త్రీలు, ముత్తైదువలు తులసికోటను అందంగా అలంకరించుకును దీపారాదన చేసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంచలు నెరవేరుతాయని పెద్దలు అంటారు, ఇది ప్రకృతి ఆరాధన మహోత్సవం జైశ్రీమన్నారాయణ.


 

Follow Us:
Download App:
  • android
  • ios