Asianet News TeluguAsianet News Telugu

RTC Strike: ఒకే దెబ్బ, కీలెరిగి వాత పెట్టిన కేసీఆర్

కేసీఆర్ ఉన్నట్టుండి కాబినెట్ భేటీ తరువాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక నిన్నటి ఆర్టీసీ కార్మికులతోని కలిసి భోజనం చేసి వారి తోని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపైన వరాల జల్లు కురిపించారు. ఎంతలా అంటే మొన్నటి దాకా తిట్టిన ఆర్టీసీ కార్మికులు వారి నోరుతోనే సిటీలు కొట్టేంత.  కేసీఆర్ లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్న. 

why did KCR"s stand change all of a sudden on rtc employees?
Author
Hyderabad, First Published Dec 2, 2019, 5:20 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి దాదాపు 55 రోజులపాటు సమ్మెబాట పట్టారు. కోర్టు మెట్లెక్కారు. ప్రతిపక్షాలు మద్దతిస్తే కేసీఆర్ దిగొస్తారేమో అని చూసారు. అన్ని చేసారు. చివరాఖరకు చేసేదేమి లేక ఎటువంటి ప్రతిఫలం లభించకపోవడంతో, బ్రతుకు వెళ్లదీయడం భారం అవడంతో వారు సమ్మెను విరమించారు. 

సమ్మెను విరమించి ఉద్యోగాల్లో చేరుతామని వారు స్వచ్చందంగా ముందుకొచ్చారు. వారు ఉద్యోగాల్లో చేరుదామని డిపోల దగ్గరకు వెళితే వారికి చేదు అనుభవం ఎదురైంది. వారిని తీసుకునేది లేదని ఆర్టీసీ ఇంచార్జి ఎండి సునీల్ శర్మ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇది ఇలా నడుస్తూ ఉండగానే కేసీఆర్ ఉన్నట్టుండి కాబినెట్ భేటీ తరువాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

Also read: కేసీఆర్ కొత్త పిట్టకథ : రామాయణం టు కలియుగం

ఇక నిన్నటి ఆర్టీసీ కార్మికులతోని కలిసి భోజనం చేసి వారి తోని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపైన వరాల జల్లు కురిపించారు. ఎంతలా అంటే మొన్నటి దాకా తిట్టిన ఆర్టీసీ కార్మికులు వారి నోరుతోనే సిటీలు కొట్టేంత.  కేసీఆర్ లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్న. 

సమ్మె కాలంలో ఆర్టీసీకి 47 కోట్లు ఇవ్వండి అని కోర్టు సూచిస్తే, తమవద్ద లేవని చెప్పారు. హుజూర్ నగర్ ఒక్క నియోజకవర్గానికి మాత్రమే 100 కోట్లు ప్రకటించిన మీరు లేవని ఎలా అంటారు అని కోర్టు ప్రశ్నించినప్పటికీ కూడా కేసీఆర్ ఏ మాత్రం చలించలేదు. కానీ నిన్న మాత్రం ఆర్టీసీకి తక్షణ సహాయం కింద 100 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించాడు. 

ఇక ఆర్టీసీ నష్టాల గురించి మాట్లాడుతూ, నష్టాల్లో ఉంది చార్జీలు పెంచితే నష్టాలు తగ్గుతాయని కార్మికులు అడిగితే అప్పుడు ప్రజావ్యతిరేకత వస్తుంది, కుదరదు అన్న కేసీఆర్ నిన్న ఏకంగా కిలోమీటర్ కు 20 పైసలు పెంచి ఆర్టీసీ నష్టాలను నివారించేందుకు ముందుకొచ్చారు.

ఇక ఇందులోనే ఆర్టీసీ మినిమం చార్జీని సిటీ బస్సుల్లో చిల్లర సమస్య కూడా తీరుస్తూ 10 రూపాయలను మినిమం ఛార్జ్ గా నిర్ణయించారు. బస్సులను ఏ రూట్లలో నడపాలో కార్మికులను అడిగి తెలుసుకోమంటూ అనేక సూచనలు కూడా చేసారు కేసీఆర్. 

ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ వైఖరిలో మార్పులు చాలా విషయాల్లో మనకు కనబడుతుంది. ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రతిపక్షాలది యూనియన్లదే బాధ్యత అని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మనసు మార్చుకొని వారికి ప్రభుత్వం కింద 2 లక్షలు, సంస్థ తరుఫున ఏమివ్వగలమో చూద్దామని అన్నాడు. అక్కడితో ఆగకుండా 8 రోజుల్లో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్టు ప్రకటించాడు. 

కేసీఆర్ వైఖరిలో మార్పుకు కారణం... 

ఇక అన్నిటికంటే ఎక్కువగా మీడియా ఛానళ్లలో మనకు కనపడే ఒక విషయం ఏమిటంటే కేసీఆర్ కేంద్రానికి భయపడ్డాడు, అందుకోసమే కేసీఆర్ కార్మికులకు ఈ విధంగా వరాలిచ్చారని లక్ష్మణ్ గారు చెబుతున్నారు. అంతే కాకుండా గడ్కరీ కెసిఆర్ కు ఫోన్ చేసారని, వెంటనే కేసీఆర్ మనసు మారిందని లక్ష్మణ్ అంటున్నారు. 

వాస్తవానికి కెసిఆర్ భయపడేవాడైతే ఇన్ని రోజులు భయపడేది ఇప్పుడు భయపడ్డాడు అనుకోవడం మన పొరపాటు అవుతుంది. కేసీఆర్ జుట్టు ఏమి ఢిల్లీ చేతిలో లేదు. పోనీ, రాష్ట్రంలో ఎమన్నా సంఖ్శోభ పరిస్థితులున్నాయా అంటే అది లేదు. దాదాపుగా అసెంబ్లీ అంతా ఆయన ఎమ్మెల్యేలే. 

ప్రజల్లో వ్యతిరేకత కూడా పెద్దగా లేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక దానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రజా వ్యతిరేకత ఉంటేనన్న, సొంత పార్టీలో ఎవరన్నా తిరుగుబాటు చేసే ఆస్కారం ఉండేది. కానీ ఇక్కడ ఆ ఛాన్స్ లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ఎంత పాపులరో ఇక్కడ కెసిఆర్ కూడా అంతే పాపులర్. 

మరో విషయం, మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బల తరువాత, ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా  2024లో పరిస్థితులు ఎలా ఉండబోతాయో చెప్పడం కష్టం. ఈ తరుణంలో కేసీఆర్ వంటి ఒక అప్రకటిత మిత్రుడ్ని కోల్పోవడానికి బీజేపీ సిద్ధంగా ఉండదు. 

అంతే కాకుండా కేసీఆర్ మెడలు గనుక కేంద్రం వంచగలిగితే  ఇన్ని రోజుల సమయం ఎందుకు పట్టినట్టు, ఇంతమంది కార్మికుల ఆత్మహత్యలు చేసుకునేంత వరకు ఎందుకు ఆగినట్టు. సమ్మె ప్రారంభంలోనే గనుక ఇలా చేసి ఉంటే చాలా మంది కార్మికుల ప్రాణాలన్న దక్కేయి కదా! ఇక అంతే కాకుండా ఇప్పుడు కేంద్రంపైన్నే కోర్టులో కేసు వేసి తేల్చుకోబోతున్నట్టు ప్రకటించాడు. భయపడేవాడైతే ఇలా కేసు వేస్తానంటాడా చెప్పండి. 

కాబట్టి ఎంత ఆలోచించినా కూడా బీజేపీ రాష్ట్ర వర్గాలు అంటున్నట్టు కేసీఆర్ కేంద్రానికి భయపడ్డాడు అనే వాదన అంత సమంజసంగా అనిపించడం లేదు. 

Also read: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు: రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు

ఇక అసలు కారణం ఏమై ఉండొచ్చు అనే విషయం గనుక చూసుకుంటే, ప్రజల్లో వ్యతిరేకత మొదలవడం అసలు విషయం. కార్మికులు సమ్మె ప్రారంభించినప్పుడు దసరా సెలవుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడంతో ఒకింత ఆర్టీసీ కార్మికుల పట్ల వ్యతిరేకత వ్యక్తమైన మాట వాస్తవం.

ప్రజల ఇబ్బందులకు తోడు కెసిఆర్ చెప్పిన మాటలైనా జీతాలు ఎక్కువగా తీసుకొని కూడా పని చేయడం లేదు, తిన్నదరక్క చేస్తున్న సమ్మె అంటూ కెసిఆర్ మాట్లాడిన మాటలు ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వ్యక్తమయ్యేందుకు కారణమయ్యింది. 

కానీ సమ్మె ముగిసిన తరువాత కార్మికులు విధుల్లో చేరుతామని డిపోల దగ్గరకు వెళితే వారిని వెళ్లగొట్టిన తీరు పోలీసుల నిరంకుశత్వం ఇవన్నీ వెరసి ప్రజల్లో అయ్యో కెసిఆర్ ఎందుకు చేర్చుకోవడం లేదు. సమ్మె కూడా వారి మీద ఎందుకంత కోపం అనే స్థాయికి వెళ్లారు ప్రజలు. 

మరీ ముఖ్యంగా మహిళా కండెక్టర్లు కంటనీరు పెడుతూ నిస్సహాయ స్థితిలో వేడుకోవడం, అవి పదే పదే టీవీల్లో నాచూపెట్టడం మాత్రం ప్రజల్లో కెసిఆర్ పట్ల ఒకింత మొదలయ్యేలా చేసింది.

దీనికి తోడు తెలంగాణ కేబినెట్ లోని మంత్రులు చాలా మంది ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడడం ఆపేసారు. సమ్మె తొలినాళ్లలో బిటి బ్యాచ్ ఒకింత కెసిఆర్ దృష్టిని ఆకర్షించడానికి ఏవో మాట్లాడారు కానీ, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ లో ఎవరు నోరు మెదపకపోతుండడం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని పసిగట్టగానే వీరు కూడా ఆగిపోయారు. 

ఈ విధంగా ఇలా ప్రజల్లో వ్యతిరేకత మొదలయ్యింది, ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటుంది అని అనుకోగానే కెసిఆర్ అలెర్ట్ అయ్యారు. ఆర్ధిక మందగమనం వల్ల గత దఫాలో ప్రవేశపెట్టినన్ని పథకాలు ఈ సరి ప్రవేశపెట్టలేకపోతున్నారు.

దానికి తోడు ఇతర కార్మిక సంఘాలను కొద్దిసేపు నిలువరించగలిగారు కానీ, ఎల్లప్పటికీ ఇతర ఉద్యోగ సంఘాలను భయపెట్టి అలా ఉంచలేరు కదా.వీరిపట్ల ఇలా వ్యవహరించడం వల్ల ఇతర కార్మిక సంఘాలకు కూడా ఒక పాజిటివ్ మెసేజ్ పోతుంది. 

ఇక మరి అసలు ప్రశ్న మరి ఇంత ఆలస్యం ఎందుకు చేసినట్టు కేసీఆర్?

కేసీఆర్ గనుక కార్మికులు సమ్మె ప్రారంభించినప్పుడే వెనక్కి తగ్గితే ఇంకా పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో ఇప్పుడు లక్ష్మణ్ గారు అన్న మాటలే రాసేవారు, కెసిఆర్ మెడలు వంచిన కేంద్రం.. రంగంలోకి అమిత్ షా దెబ్బకు తోక ముడిచిన కెసిఆర్ ఇలా రకరకాల స్టేట్మెంట్లు వచ్చేవి. 

ఇదొక్కటే కాదు, ప్రతిపక్షం  కూడా తాము అప్పర్ హ్యాండ్ సాధించుకున్నట్టు చెప్పుకునేది. ప్రజల్లో కూడా కెసిఆర్ ప్రతిపక్షానికి భయపడ్డాడు అనే ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యే ఆస్కారం కూడా లేకపోలేదు. 

Also read: కేసీఆర్ ఆదేశం, కదిలిన సర్కార్: ప్రియాంక కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు

కెసిఆర్ కోర్టుకి కానీ, ప్రతిపక్షానికి కానీ, కేంద్రానికి కానీ భయపడడు అనే ఒక విషయం బల్ల గుద్ది చెప్పదల్చుకున్నాడు. చెప్పాడు. చిట్టచివరకు తానే అందరి మంచి చెడ్డలు చూసుకుంటానని, ఈ విషయమై తనతో మంచిగా ఉంటె చాలు అని అన్ని వర్గాలకు ఒక మెసేజ్ కూడా పాస్ చేసినట్టయ్యింది. 

మరి సమ్మె ప్రారంభానికి ముందే ఈ పనులు చేయొచ్చు కదా అంటే అప్పుడు కెసిఆర్ ఆలోచన వేరు. ఆర్టీసీ ప్రయివేటీకరించాలని కంకణం కట్టుకున్నాడు. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా పోగవుతుండడంతో ఇలా ఆ విషయమై వెనక్కి తగ్గి ఇలా ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపెట్టగలిగారు. 

ఈ పూర్తి ఎపిసోడ్ లో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది అనవసరమైన విషయం. కెసిఆర్ కార్మికుల బాధలను అర్థం చేసుకున్నాడు. కార్మికుల సమ్మె వల్ల ప్రజాభిప్రాయం వల్ల తన ఆలోచనలని వెనక్కి తీసుకున్నాడు. తద్వారా మేలు జరిగింది తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు. ఇక్కడ గెలిచింది ప్రజాస్వామ్యం. 

Follow Us:
Download App:
  • android
  • ios