తిరుమల చేరుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి ముగిసిన ఎమ్మెల్యే  గోపిరెడ్డి పాదయాత్ర

జగన్ సీఎం కావాలని కోరుతూ నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర.. శుక్రవారంతో ముగిసింది. గోపిరెడ్డి గత నెల 21వ తేదీన గుంటూరు జిల్లా నర్సారావుపేట నుంచి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.

రోజుకి 30కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేస్తూ.. శుక్రవారం రోజున తిరుమలకు చేరుకున్నారు. 13రోజుల పాటు ఈ పాదయాత్ర సాగిందని వైసీపీ నేతలు చెప్పారు. తిరుమల చేరుకోగానే ఆయన... వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జగన్... ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టించినప్పటికీ... దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేశానని గోపిరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే పాదయాత్ర పూర్తి కావడం పట్ల వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. గోపిరెడ్డి ఈ రోజు సాయంత్రం తన పాదయాత్ర విశేషాలను జగన్ కి వివరిస్తారని పార్టీ నేతలు చెప్పారు.