ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీరు దారుణం
- ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న శ్రీకాంత్ రెడ్డి
- ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీరు దారుణమన్న ఎమ్మెల్యే
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రవర్తిస్తున్న తీరు దారుణమని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్పీకర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ని కోరినా.. కోడెల చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
పార్టీ ఫిరాయింపుల అంశం కోర్టులో ఉందని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. గతంలో అసెంబ్లీ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు బహిష్కరించిన సమయంలో తనను ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదని స్వయంగా కోడెల చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడేమో మాటమారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలనే తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినట్టు చెప్పారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి 20 గంటల సమయం ఉందని, పార్టీ మారిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటే అసెంబ్లీకి హాజరవుతామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని స్పీకర్ గౌరవిస్తే సభకు వస్తామన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించడం దారుణమన్నారు.