పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారా?
- రాజాపై దాడిని ఖండించిన వైసీపీ నేతలు
- ఎస్ఐపై క్రిమినల్ కేసు పెట్టాలన్న వైసీపీ
- ఎస్ఐ నాగరాజును తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పచ్చచొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై జరిగిన దాడిని వైసీపీ శ్రేణులు ఖండించాయి. ఈ విషయంపై సోమవారం వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, సుధాకర్బాబు, పైలా సోమినాయుడులు మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ నేతలను కావాలని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. జక్కంపూడి రాజాపై రామచంద్రపురం ఎస్ఐ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన ఎస్ఐ నాగరాజును తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని, రెచ్చగొట్టే చర్యలను ప్రభుత్వం ఆపాలన్నారు. తాటాకు చప్పుళ్లకు తమ పార్టీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.