సొంత పార్టీపై విమర్శలు చేసిన బీజేపీ నేత యశ్వంత్ సిన్హా జీఎస్టీని బ్యాడ్ కాంప్లికేటెడ్ ట్యాక్స్ చేశారంటూ విమర్శ ప్రభుత్వాన్ని ఎదిరించడానికి కొత్త లోక్ శక్తి రావాలని పిలుపు
కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా.. మరోసారి కేంద్రప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలం క్రితం... పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన యశ్వంత్.. సొంత పార్టీపై, ప్రధాని మోదీపై సూటిగా విమర్శలు చేశారు.
విదర్భ లోని అలోకాలో ఏర్పాటు చేసిన ఎన్జీవో కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజశక్తి( ప్రభుత్వ శక్తి)ని లోక్ శక్తి( ప్రజల శక్తి) కళ్లెం వేయాల్సిన అవసరం ఉందన్నారు. సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ గురించి ప్రస్తావిస్తూ.. లోక్ శక్తి ఉద్యమం రావాలన్నారు. ఆ ఉద్యమం మాత్రమే రాజశక్తిని అదుపు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తాము ఆర్థిక మాంద్యంలో ఉన్నామని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో ఏ నెంబర్ల గురించి మాట్లాడాలి అని ప్రశ్నించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం గంటల పాటు ఇచ్చిన ఓ ప్రసంగంలో భారత్ అభివృద్ధి చెందుంతోందని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. మన దేశంలో కార్లు, బైకులు అధిక శాతంలో అమ్ముడౌతున్నాయని అది అభివృద్ధికి సంకేతమని చెప్పారని.. కార్లు, బైకులు అమ్మితే అభివృద్ధేనా అని ప్రశ్నించారు. మన దేశంలో కార్లు అమ్ముడౌతున్నాయి సరే.. అసలు తయారౌతున్నాయా అంటూ ప్రశ్నించారు.
ఫెయిల్ అయిన డీమానిటైజేషన్ గురించి తానేమి మాట్లాడాలన్నారు. అనంతరం జీఎస్టీ గురించి మాట్లాడుతూ.. జీఎస్టీ అనేది ‘ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్’ అని చెప్పారు. కాకపోతే అధికారంలో ఉన్న నేతలు మాత్రం జీఎస్టీని బ్యాడ్ అండ్ కాంప్లికేటెడ్ ట్యాక్స్ గా మార్చారన్నారు. ప్రజలు ఏమి ఫీలౌతున్నారో.. అదే తాను మాట్లాడుతున్నానని ఆయన అన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోని ఝార్ఖండ్ రాష్ట్రం నుంచి తానొచ్చానని.. కానీ ప్రస్తుత రోజుల్లో అక్కడ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యశ్వంత్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.
