ద్రవిడ రాజకీయాలలోకి వచ్చేందుకు తాను తమిళేతరుడిననే న్యూనతా భావం సూపర్ స్టార్ రజనీకాంత్ ను వెనక్కు లాగుతున్నట్లుంది. అభిమానులతో జరిపిన అయిదురోజుల మంతనాలలో నేడు చివరి రోజున తాను పదహారాణాల తమిళుడినే నని నమ్మాలని కోరారు. తమిళనాడు నుంచి వెళ్లిపో అంటే, హిమాలయాలకు పోతాను గాని,  మరొక రాష్ట్రం వెళ్లి స్థిరపడనని ఆయన వివరణ ఇచ్చారు.

ద్రవిడ రాజకీయాలలోకి వచ్చేందుకు తాను తమిళేతరుడిననే న్యూనతా భావం సూపర్ స్టార్ రజనీకాంత్ ను వెనక్కు లాగుతూ ఉందా? ఆయన ధోరణి చూస్తే అవుననిపిస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎందుకంటే, ఈ రోజు అభిమానులతో మాట్లాడుతూ,తనను తమిళేతరుడని చేస్తున్న విమర్శకు ఆయన చాలా వివరణ ఇచ్చారు.

ఈ వివరణ వింటే, ఎక్కడో ఆయన మనసులో తను ద్రవిడ రాజకీయల్లోకి వస్తే ఎవరో ఒకరు ఈ సమస్య లేవనెత్తి ప్రాంతీయ చిచ్చు పెడతారని ఆయన శంకిస్తున్నట్లు తోస్తుంది. ఇతర ద్రవిడ ప్రాంతీయ పార్టీల నాయకులనుంచి తమిళేతరుడనే విమర్శరాకుండా ఆయన ఈ రోజు వారిని ప్రశంసలతో ముంచెత్తారు. రాజకీయ ప్రవేశం గురించి ఆయన తన అభిమానులతో సుదీర్ఘ మంతానాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. చివరి రోజున, శుక్రవారం నాడు ఏకంగా రాబోయే యుద్ధానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పిలుపునిస్తూ తన ప్రాంతీయత మీద వివరణ ఇచ్చారు. తాను ప్యూర్ తమిళుడినేనని, నమ్మమని కోరారు.

ఆయన సొంతపార్టీ పెడితే, సుబ్రమణ్య స్వామి రజనీకాంత్ తమిళుడు కాదు అని అల్లరిచేసే అవకాశం మెండుగా కనపడుతూ ఉంది.నిజానికి ఈ రోజు రజనీ వివరణ కూడా స్వామికే.

ఈ రోజు ఆయన తన పాంతీయత గురించి అన్న మాటలివి:

‘తమిళనాడు రాజకీయాలలో తమిళగడ్డ మీద పుట్టిన వారు లేరని తరచూ వినబడుతూన్న విమర్శకునేను సమాధానం చెప్పాలనుకుంటున్నారు. నేను స్వచ్ఛమయిన తమిళుడిని. నమ్మండి’

‘ఈ (ప్రాంతీయ) విషయం మీద వివరణ ఇవ్వాలనకుంటున్నాను. నేను తమిళేతరుడిని అనే ప్రశ్న లేవదీస్తున్నారు కొందరు. నాజీవితంలో మొదటి 23 సంవత్సరాలు మాత్రమే కర్నాటకలో ఉన్నాను. 44 సంవత్సరాలు తమిళనాడులో ఉన్నాను. నేను మరాఠి-కన్నడిగుడిగానే తమిళనాడుకు వచ్చినా, ఎలాంటి జంకుగొంకు లేని మద్దతుప్రకటించి తమిళ ప్రజలను నన్ను సంపూర్ణ తమిళుడిని చేశారు. నేను పదహారాణాల తమిళుడిని. నాపూర్వీకులు కృష్ణగిరి జిల్లావారు,’ అని రజనీకాంత్ ఆవేశంగా చెప్పారు.

‘తమిళనాడు వదిలేసి వెళ్లిపో అని నన్నెవరైనా అంటే, నేను హిమాలయాలకు పోతాను గాని దేశంలోని మరొక రాష్ట్రానికి పోయే ప్రసక్తి లేదు,’ అని ఆయన స్పష్టం చేశారు.

పలువురు ద్రవిడ పార్టీల నాయకులను ఆయన ప్రశంసించారు. డిఎంకె నేత స్టాలిన్, పిఎంకెనాయకుడు అన్బుమణి రామ్ దాస్, విసికె చీఫ్ తిరుమావళవన్ వంటి గొప్ప నాయకులు తమిళనాడులో ఉన్నారనిపొగిడారు.అయితే, రాజకీయ వ్యవస్థ మాత్రం కుళ్లిపోయిందని చెప్పారు.

‘ఫ్రీ హ్యాండిస్తే, డిఎంకె నాయకుడు స్టాలిన్ ఎన్నో విచిత్రాలు సృష్టించగలరని చో రామస్వామి చెబుతూ ఉండేవారు. అన్బుమణి రామదాస్ కూడా బాగా చదువుకున్నవాడు. మంచి భావాలున్నవాడు. ఎన్ టికె లీడర్ సీమన్ భావాలు ఒక్కొక్కసారి నాకు విస్మయం కల్గించేవి. అయితే, ఈ వ్యవస్థ ఉంది చూశారూ, ఇది కంపుకొడుతూ ఉంది. ఈ ప్రజాస్వామ్యం కుళ్లిపోయి ఉంది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని చూసే పద్ధతి మారిపోయింది. ప్రజలనుకుంటున్న ప్రజాస్వామ్యంలో మార్పు రావాలి,’ అని రజనీకాంత్ అన్నారు.

యుధ్దానికి సన్నద్ధం కావాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.

‘ఇంటికి తిరిగివెళ్లి, మీపనుల్లో మీరుండండి. మనం తలపడాల్సిన రోజు దానికదే వస్తుంది,’ అని ఆయన చెప్పారు.