విజయసాయి రెడ్డికి ప్రమోషన్
- విజయసాయిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చిన జగన్
- వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుబాంక విజయసాయి రెడ్డికి పార్టీ అధినేత జగన్.. ప్రమోషన్ ఇచ్చారు. విజయసాయి రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ.. జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైసీపీ కార్యాయలం ఓ ప్రకటన విడుదల చేసింది.
విజయసాయిరెడ్డికి... జగన్మోహన్ రెడ్డి తో గొప్ప అనుబంధం ఉంది. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే విజయసాయికి జగన్ తో పరిచయం ఉంది. అప్పటి నుంచే జగన్ ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూసేవారు. వైఎస్ మరణం తర్వాత జగన్ కి అన్ని విధాలా చేదుడువాదోడుగా నిలిచారు. కేంద్రంలోని పెద్దలను జగన్ కలవాలన్నా.. అందుకు తగిన ఏర్పాట్లు చేసేది కూడా ఈయనే. ఇవన్నీ ముందుగా ఆలోచించే జగన్.. విజయ్ సాయిని రాజ్యసభకు పంపించారు. పార్టీ గొంతును విజయ్ సాయి పార్లమెంటులో సమర్థవంతంగా వినిపించారు.
పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, పార్టీని బలోపేతం చేయడంలో విజయ సాయి కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఉత్తరాంధ్రలో బలహీనంగా ఉన్న వైసీపీని బలోపేతం చేసే పనిలో ఇప్పుడు విజయ్ సాయి బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన విశాఖ ను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయ్ సాయి సేవలను మెచ్చి.. ఆయనను జాతీయ కార్యదర్శిగా ప్రమోట్ చేశారు.