ఈ రోజు హైదరాబాద్ లో వింత కనిపించిది. తెలుగు రాజకీయాలలో ఉపన్యాసాన్ని వశీకరణ మంత్రంలాగా వాడుకున్న ఇద్దరు నేతలు ఒకే వేదిక మీదకొచ్చారు.
ఇద్దరు మాటల మాంత్రికులు పోటీ పడితే...ఈ రోజు హైదరాబాద్ లో ఇదే జరిగింది. తెలుగు రాజకీయాలలో ఉపన్యాసాన్ని వశీకరణ మంత్రంలాగా వాడుకున్న ఇద్దరు నేతలు ఒకే వేదిక మీదకొచ్చారు. వారిద్దరిలో ఒక ముఖ్యమంత్రి కెసిఆర్ కాగా, మరొకరు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ రోజు ఉపరాష్ట్రపతి పౌరసన్మానం సందర్భంగా వేదిక మాటల కఛేరి జరిగింది.
గత పది హేను సంవత్సరాలలో వారు పద ప్రయోగంతోనే చమత్కారాలు చేశారు. చప్పట్టుకొట్టించుకున్నారు.ఔరా అనిపించుకున్నారు. ఆలోచింపచేశారు. ఆవేశం పంచారు. జేజేలు కొట్టించుకున్నారు. అపుడపుడు మాటలతో పూల వానలు కురిపించారు. మాటాలను ముళ్ల బాణాల్లాగా ప్రయోగించారు. కొన్ని సార్లు వీళ్ల భాష ఇబ్బందులకూ కారణమయింది. వీళ్ల మాటలు లోన లొటారాలని మాట పడిన సందర్భాలుకూడా ఉన్నాయి.
ఇలాంటి నాయకులు ఒకే వేదిక మీది నుంచి మాట్లాడటం ఈ రోజు జరిగింది. బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఇద్దరు చాలా కాలం రాజకీయంగా ఎడమొగం పెడమొగంగా ఉన్నవారే. విభజనతో కాలం మారింది. మనుషులు మారుతారుగా. అందుకే వెంకయ తో పోటీ పడేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మొప్పు పొందేందుకు వెంకయ్య ముందుకురికారు. పద్యాలను కోట్ చేస్తూ వెంకయ్య గొప్పదనాన్ని చెబితే, సహజసిద్ధమయిన యతి ప్రాసలతో వెంకయ్యనాయుడు కెసిఆర్ ను ప్రశసించారు. ఇద్దరు, రాజకీయం దట్టించిన మాటల్ని తూటాల్లా ప్రయోగించి భారత దేశాన్ని జయించినవారే.
కెసిఆర్ తన తెలంగాణ ప్రయోగంతో ప్రత్యేక రాష్ట్రానికి యావద్భారత దేశపు మద్ధతు కూడగడితే, వెంక్యనాయుడు మాటల సుడిగాలి సృష్టించి ఉత్తర భారతాన్ని తన వైపు లాక్కుని బిజెపి అధ్యక్షుడయ్యారు. కేంద్ర మంత్రి అయ్యారు, ఇపుడు ఉప రాష్ట్రపతి అయ్యారు. 1996 నుంచి, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నతన మాటే బిగ్గరగా వినపడేలా వెంకయ్య చేశారు. ఎన్డీయేలో ఎవరూ ప్రధానిగా ఉన్నా తన మాట చెల్లుబాటయ్యేలా చేసుకున్నారు. ఇద్దరు మాటల మీద స్వారీ చేసి ఢిల్లీ ని చేరుకున్నారు. ఢిల్లీ ని తమ వైపు తప్పుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఉపన్యాసంతో దేశ రాజధానిలో తెలుగు సంచలనం తీసుకు వచ్చింది ఈ రావ్ సాబ్, వెంకయ్య జీలే.
ఈ రోజు హైదరాబాద్ లో పౌరసన్మానంలో దాదాపు ఉద్ధండుల పోటీలా వాళ్ల ఉపన్యాసాలు పోటీ పడ్డాయి. చివరకు ఇద్దరు గెలిచారు.ఒకటే చప్పట్లు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి
