మెట్రో సదుపాయం లేని ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రవాణ ట్రామ్ వే, మోనో రైలు సదుపాయాన్ని కల్పించనుంది
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మెట్రో రైలు పూర్తైతే.. నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గిపోతేంది. మరి మెట్రో లేని ప్రాంతాల సంగతి ఏమిటి.. అందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ తోపాటు ఇతర పట్టణాలకు ట్రామ్ వే, మోనో రైలు సదుపాయాన్ని కల్పించనుంది. ఇప్పటి వరకు రైలు పట్టాలపై ప్రయాణించే రైళ్లనే మనం చూశాం. ఈ ట్రామ్ రోడ్డుపై కూడా ప్రయాణిస్తుంది.
ఈ మేరకు జీహెచ్ఎంసీ( గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్) అధికారులు ఫ్రెంచ్ సంస్థతో చర్చలు జరిపినట్లు సమాచారం. మొదటి దశలో మొజంజాహీ మార్కెట్ నుంచి చార్మినార్, గోల్కొండ, కులికుతుబ్ షా సమాధులు వరకు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతం వరకు ట్రామ్ వే ఏర్పాటుకు రూ.250కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో ఈ ట్రామ్.. కోల్ కతాలో మాత్రమే ఉంది.
ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించింది. హైదరాబాద్ , తెలంగాణ లోని ఇతర పట్టణాలలో ట్రామ్ వే రైలు, ఇతర రవాణా సౌకర్యాల గురించి వారు చర్చించారని సమాచారం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే.. మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రైలు సదుపాయం లేని ప్రాంతాల్లో మాత్రమే ఈ ట్రామ్ వే సదుపాయం ఏర్పాటు చేస్తారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
