ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన ప్రక్రియలో భాగంగా రేపు శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ మహా శోభయాత్రకు ప్రజలు లక్షల సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

హైదరాబాద్ నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేషుని ప్రతిమల్లో దాదాపు 50శాతం విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యింది. అయితే.. ఇప్పుడు అందరి చూపు ఖైరతాబాద్ గణేషుని వైపే. ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన ప్రక్రియలో భాగంగా రేపు శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ మహా శోభయాత్రకు ప్రజలు లక్షల సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

 ఖైరతాబాద్ గణేషునితోపాటు.. నగరంలోని పలు పెద్ద వినాయకుని విగ్రహాలను రేపు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ఆ వైపుగా ఆంక్షలు విధించారు. ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. నిమజ్జనానికి భక్తులు వచ్చేందుకు ప్రధాన రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులకు నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలనుంచి వచ్చే బస్సులను నగర శివార్లకు పరిమితం చేస్తారు. అంతేకాకుండా.. ట్యాంక్ బండ చుట్టుపక్కల దాదాపు 5కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి అరగంటకు ఒక ఎంఎంటీఎస్‌ రైలు నడిచేలా ఎర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జంట నగరాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 24వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడమేగాక 13 కంపెనీల కేంద్ర పారా మిలటరీ దళాలను, సమస్యాత్మక ‍ప్రాంతాల్లో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్సును రంగంలోకి దించారు. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున గణేష్‌ యాక్షన్‌ టీంను కూడా ఏర్పాటు చేశారు.