ఆంధ్ర కళకళలాడుతూ ఉండాలి: తెలంగాణ మంత్రి ఆకాంక్ష
గతంలో అమరావతి భూమి పూజ జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చాను. మూడేళ్ల కాలంలోనే మంచి అభివృద్ధి జరిగింది. తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయనే భావం దేశమంతా ఉంది.ఇది గొప్ప విషయం.
బాగా వర్షాలు కురిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కళకళలాడాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈ టెల రాజేందర్ ఆకాంక్షించారు.
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి సాధించిందని ఇది హర్షదాయకమని ఆయన అన్నారు. కుమారుడి వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులను ఆహ్వానించేందుకు ఆయన నేడు విజయవాడు వచ్చారు. ఉదయం గన్నవరం విమానాశ్రయంలోనే ముఖ్యమంత్రి ని కలిశారు. తర్వాత అమరావతిలోని సచివాలయానికి వచ్చి మంత్రులు పుల్లారావు, నారాయణ, కొల్లు రవీందర్కు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు బాగాకురియడంతో ఏరువాక దిగ్విజయంగా సాగుతోందని, ఇంకా బాగా వర్షాలు పడి రాష్ట్రం కళకళ లాడాలని ఆకాంక్ష వెలిబుచ్చారు.
‘‘గతంలో అమరావతి భూమి పూజ జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చాను. మూడేళ్ల కాలంలోనే మంచి అభివృద్ధి జరిగింది. తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయనే భావం దేశమంతా ఉంది. ఇది గొప్ప విషయం,’’అని రాజేందర్ అన్నారు. విభజన జరిగాక రెండు రాష్ట్రాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అన్నదమ్ములు విడిపోతేనే ఇబ్బందులుంటాయని.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలువిడిపోయాక సమస్యలుంటాయని, అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు అంత పరిష్కారం లేనంత పెద్దవేం కాదని అని చెప్పారు.
జీఎస్టీ విషయంలోనూ ఉమ్మడి ఆలోచనలతోనే తాము ముందుకు వెళ్లామని ఆయన వెల్లడించారు.