ఈ నెల 27న బెజవాడ వస్తున్న కేసీఆర్
- ఈనెల 27న విజయవాడకు రానున్న కేసీఆర్
- కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్న కేసీఆర్
- తెలంగాణ మొక్కులు తీర్చుకుంటున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనకదుర్గమ్మ వారి మొక్కు తీర్చుకోనున్నారు. నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఆయన విజయవాడకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ... కనక దుర్గకు బంగారు ముక్కు పుడకను సమర్పించనున్నారు.
గతంలో కేసీఆర్.. వరంగల్ లోని భద్రకాళీ అమ్మవారికి బంగారు కిరీటం, తిరుపతి తిరుచానూర్ లోని పద్మావతి అమ్మవారికి ముక్కు పుడక, కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొక్కులు తీర్చుకుంటానని ప్రకటించిన ఆయన అందు కోసం రూ.59లక్షలు కేటాయించారు.
ఇందులో భాగంగానే ఈ నెల 27న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. తన ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే.. విజయవాడ వెళతానని ప్రకటించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది.