తమిళనాడులో 10 మందిని బలిగొన్న రోడ్డుప్రమాదం
- తమిళనాడులో రోడ్డు ప్రమాదం
- 10 మంది మృతి
- మరో ఐదుగురికి గాయాలు
తమిళనాడులో ఇవాళ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తిరుచ్చి జిల్లాలోని జాతీయ రహదారిపై బోర్ వెల్ వాహనాన్ని ప్రయాణికుల వ్యాన్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మృతిచెందగా, మరో 5 గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడినవారిని తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారు ప్రయాణించిన వాహనం నుజ్జునుజ్జయింది.
ఈ వ్యానులోని ప్రయాణికులంతా నాగర్కోయిల్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం బోర్వెల్ వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. రోడ్డుపై బోర్ వెల్ లారీని డ్రైవర్ ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో వెనుక వస్తున్న వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొన్నట్లు చెబుతున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన తిరుచ్చి ఎస్పీ కల్యాణ్ సహాయక చర్యలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బోర్ వెల్ డ్రైవర్ పరారిలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.