ప్రాణాలకు తెగించి 400మంది చిన్నారులను రక్షించి హీరోగా నిలిచాడు. దాదాపు కిలోమీటరు పాటు.. బాంబుని భుజాలపై పెట్టుకొని పరుగులు తీశాడు

ఎక్కడైనా బాంబు ఉందని తెలిస్తే.. అటు వైపు వెళ్లడానికే భయపడతాం. కానీ ఓ పోలీసు మాత్రం అలా భయపడలేదు సరికదా.. ప్రాణాలకు తెగించి 400మంది చిన్నారులను రక్షించి హీరోగా నిలిచాడు. దాదాపు కిలోమీటరు పాటు.. బాంబుని భుజాలపై పెట్టుకొని పరుగులు తీశాడు. ఆయన అలా పరుగులు తీస్తున్న సమయంలో బాంబు పేలినా పేలవచ్చు. కానీ ఆయన అవేమి ఆలోచించలేదు. కేవలం చిన్నారుల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో పరుగులు తీశాడు. అతనే అభిషేక్ పటేల్

వివరాల్లోకి వెళితే.... మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ కి 170కిలోమీటర్ల దూరంలో సాగర్ అనే ప్రాతం ఉంది. అక్కడి ఓ పాఠశాల ప్రాంగణంలో స్కూల్ యాజమాన్యం బాంబుని గుర్తించింది. ఆ పాఠశాలలో 400మంది చిన్నారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆ ప్రాంత హెడ్ కానిస్టేబుల్ అభిషేక్ పటేల్ అక్కడికి చేరుకున్నాడు.

 చిన్నారులను రక్షించాలనే లక్ష్యంతో దాదాపు 12 అంగుళాల పొడవు 10కిలోల బరువు ఉన్న బాంబును భుజలపై పెట్టుకోని కిలో మీటరు పాటు పరుగులు తీశాడు. ఎవరూ లేని ప్రదేశంలో ఆ బాంబుని ఉంచి బాంబు స్వ్కాడ్ సిబ్బంది సహాయంతో దానిని నిర్వీర్యం చేశారు. ప్రమాదం నుంచి బయటపడినందుకు పాఠశాల యాజమాన్యం, చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

 అసలు ఆ బాంబు పాఠశాల పరిసర ప్రాంగణంలోకి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.