కర్ణాటకకు షాక్: కావేరి జలాలపై సుప్రీం వార్నింగ్
కర్ణాటక పై సుప్రీం ఆగ్రహం కావేరి జలాల వివాదంలో సుప్రీం కోర్టు కర్ణాటకపై ఫైర్ అయింది.
న్యూఢిల్లీ: కర్ణాటక పై సుప్రీం ఆగ్రహం కావేరి జలాల వివాదంలో సుప్రీం కోర్టు కర్ణాటకపై ఫైర్ అయింది. తమిళనాడుకు విడుదల చేయాల్సిన నీటిని వెంటనే విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన సుప్రీం తక్షణమే ఈ ఇష్యుపై అఫిడవిట్ దాఖలు చేయాలని సెంట్రల్ సర్కార్ ను ఆదేశించింది.
ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన నీటిని విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యంపై కర్ణాటక సర్కార్ ను కోర్టు తప్పుపట్టింది. వెంటనే నీటిని విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. వివాదం ముదురుతుంటే ఇప్పటి వరకు కావేరీ మేనేజ్ మెంట్ బోర్టు ఏర్పాటు ఎందుకు చేయడం లేదని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
అయితే కావేరీ బోర్టు ఏర్పాటుకు సంబంధించిన డ్రాప్ట్ ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించాల్సి ఉందని అటార్నీ జనరల్ కే.కే. వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ప్రధాని కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నారని అందువల్లే జాప్యం జరిగిందన్నారు. డ్రాప్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు మే 8వ తేదికి వాయిదా వేసింది.
వేసవి కావడంతో నీటి అవసరం పెరిగింది. దీంతో కావేరి నీటిని విడుదల చేయాల్సిందేనని తమిళనాడు తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు వెంటనే నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వడంతో కర్ణాటక ఎలా స్పందిస్తుందో చూడాలి!