రూ.9,900తో శాంసంగ్ గెలాక్సీ ఎస్9 మీ చేతిలో
- ఎయిర్ టెల్ స్టోర్లలో రూ.9,900కే లభిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లు
ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ పై ఎయిర్ టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. శాంసంగ్ ఇటీవల గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్లను దేశంలోని అన్ని ప్రధాన రీటైల్ సెల్లర్స్ విక్రయిస్తుండగా, పలు ఆన్లైన్ సైట్లలోనూ ఈ రెండు ఫోన్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే ఎయిర్టెల్ సంస్థ తన కస్టమర్లకు రూ.9,900 డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు దాంతో గెలాక్సీ ఎస్9 లేదా ఎస్9 ప్లస్ ఫోన్ను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఎయిర్టెల్ తన ఆన్లైన్ స్టోర్ వెబ్సైట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లను విక్రయిస్తోంది. అయితే వీటిని కొనాలంటే వినియోగదారులు మొత్తం రుసుం చెల్లించాల్సిన పనిలేదు. కేవలం రూ.9,900 డౌన్పేమెంట్ చెల్లిస్తే చాలు, ఫోన్ ఇంటికి డెలివరీ అవుతుంది. ఇక మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2499 చొప్పున చెల్లించాలి. గెలాక్సీ ఎస్9 ప్లస్ అయితే నెలకు రూ.2799 చెల్లించాలి. మొత్తం 24 నెలల పాటు నెల నెలా ఈ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఈఎంఐలోనే ఎయిర్టెల్ ప్లాన్ కలిసిపోయి ఉంటుంది.
దాంతో వినియోగదారులకు నెలకు 80 జీబీ ఉచిత మొబైల్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఉచిత ఎయిర్టెల్ హ్యాండ్సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్, 1 ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్లకు చెందిన 64జీబీ వేరియెంట్లకు రూ.9,900 డౌన్ పేమెంట్ చెల్లించాలి. అదే 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లకు అయితే రూ.17,900 డౌన్పేమెంట్ కట్టాలి.
మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్9 64 జీబీ రూ.57,900 ధరకు లభ్యమవుతుండగా 256 జీబీ వేరియెంట్ రూ.65,900 ధరకు లభిస్తోంది. అలాగే గెలాక్సీ ఎస్9 ప్లస్ 64 జీబీ రూ.64,900 ధరకు, 256 జీబీ రూ.72,900 ధరకు లభిస్తున్నాయి.