లుథియానాలో ఆర్ ఎస్ ఎస్ నేత దారుణ హత్య
- ఆర్ ఎస్ ఎస్ నేత రవీందర్ పై కాల్పులు
- ద్విచక్ర వాహనంపై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు
లుథియానాకి చెందిన ఆర్ ఎస్ ఎస్ నేత రవీందర్ గోసైన్ ని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చి చంపేశారు. మంగళవారం ఉదయం రవీందర్ ని కైలాష్ నగర్ లోని ఆయన ఇంటికి సమీపంలో ఇద్దరు వ్యక్తులు పసుపు రంగు హోండా స్టన్నర్ ద్విచక్రవాహనం పై వచ్చి కాల్పులు జరిపి...అక్కడి నుంచి పారిపోయారు. ఆ సయంలో రవీందర్, మనవరాలు దీక్షిత, మనవుడు ఆయన వెంటే ఉన్నారు.
దీంతో ఆయనను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందారని స్థానిక బీజేపీ లీడర్ రవీంద్ర అరోరా చెప్పారు. ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం నుంచి రవీందర్ ఇంటి సమీపంలో రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యింది. కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి ఉన్నట్లు గుర్తించారు.
60ఏళ్ల రవీందర్ గోసైన్.. 30 సంవత్సరాలుగా ఆర్ ఎస్ ఎస్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.