రామయణంపై జపాన్ లో స్టాంపులు
- జపాన్ లో రామాయణం స్టాంపులు
- విడుదల చేసిన భారత రాయబారి చినోయ్
భారత ఇతిహాస కథైన రామాయణంపై స్టాంపులు విఢుదల చేశారు. కాకపోతే అది రాముడిని దేవుడిగా పూజించే మన దేశంలో కాదు.. జపాన్ దేశంలో. మీరు చదివింది నిజమే. జపాన్ లో రామాయణ స్టాంపులను విడుదల చేశారు. జపాన్లోని యొయొగి ఉద్యానవనంలో శనివారం రామాయణంపై స్మారక స్టాంపులను ఆవిష్కరించారు. నమస్తే ఇండియా 2017 సాంస్కృతిక వేడుకల్లో పాల్గొన్న వందలాది మంది భారతీయ, జపాన్ జాతీయుల సమక్షంలో భారతీయ రాయబారి సుజన్ ఆర్.చినోయ్ వీటిని లాంఛనంగా విడుదల చేశారు.
అనంతరం చినోయ్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో రామాయణ స్టాంపులను గత శుక్రవారం విడుదల చేసినట్లు చెప్పారు. కేవలం భారత్, జపాన్ లలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రామాయణ స్టాంపులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇతర దేశాల్లోని భారత రాయబారులు ఈ స్టాంపులను విడుదల చేస్తారని ఆయన చెప్పారు. నమస్తే ఇండియా ఆధ్వర్యంలో ఈ స్టాంపులను విడుదల చేయడం చాలా గర్వంగా ఉందని చినోయ్ అన్నారు.
భారత సంస్కృతిని తెలియజేసేలా నమస్తే ఇండియా ప్రతిసంవత్సరం జపాన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 1993లో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్విరామంగా అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు సాగనున్న ఈ ఉత్సవంలో పలు కల్చరల్ ప్రోగ్రామ్స్, లైవ్ మ్యూజిక్, హ్యాండిక్రాఫ్ట్స్, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.