లోగుట్టు... పోయిస్ గార్డెన్ కు ఎరుక

అమ్మ లేని తమిళనాడు ఇంకా కోలుకోకముందే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆమెతో చాలా కాలం కలివిడిగా ఉన్న వ్యక్తులే ఇలాంటి ఆరోపణలు వ్యక్తం చేయడం గమనార్హం.

74 రోజుల తర్వాత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అమ్మ పై చాలా ఏళ్ల నుంచే కుట్ర జరిగిందని ముగ్గురు మహిళలు అనుమానాలు వ్యక్తం చేశారు.

వారిలో ఒకరు జయలలితకు మేనకోడలు దీప.. మరొకరు అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప.. మరొకరు సినీ నటి గౌతమి.

ఈ ముగ్గురు మీడియాకెక్కి మరీ ఇలాంటి ప్రకటనలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

జయలలితపై 5 సంవత్సరాలుగా కుట్ర జరిగిందని ఎంపీ శశికళ పుష్ప అనుమానం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా అమ్మకు ఆహారంలో ఏదో కలిపిస్తున్నారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స జరిగినన్ని రోజులు ఎందుకు గోప్యంగా ఉంచారని ఆమె ప్రశ్నించారు

ఇక సినీనటి గౌతమి కూడా ఇటీవల ఇలాంటి సందేహాలను వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖలో ఆమె అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ లేఖ రాసినందుకు ఆమె దిష్టిబొమ్మను కొందరు చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు.

జయ లలిత మేనకోడలు దీప కూడా పోయిస్ గార్డెన్ లో ఏదో జరిగిందనే అనుమానం మొదటి నుంచి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా జయ సన్నిహితురాలు శశికళను టార్గెట్ చేస్తూ ఆమె అనేక ఆరోపణలు చేశారు.

అయితే వీటిపై అధికార అన్నా డీఎంకే పార్టీ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.