ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఫోటో.. పేరు.. అతనికి ఏదైనా నేర చరిత్రా ఉందా..? అతనికి ఎంత మేర ఆస్తులు ఉన్నాయి..

పోలీసు స్టేషన్ లలో, బస్ స్టేషన్ లలో దొంగతనాలు, చోరీలు చేసిన వారి ఫోటోలు, వివరాలు పెట్టడం చాలా చోట్ల చూసే ఉంటారు. మరి పోలింగ్ కేంద్రాల్లో ఎప్పుడైనా చూశారా..? అందులోనూ.. ఆ ఎన్నికల్లో పోటీ చేసే వారివే అయితే.. అదే అమలు చేస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చాలా ఎన్నికలు జరుగుతుంటాయి. మనలో చాలా మందికి మనం ఎవరికి ఓటు వేస్తున్నాం.. వాళ్ల బ్యాగ్రౌండ్ ఎమిటి లాంటి విషయాలు తెలియవు. అందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త ఒరవడికి తెర లేపింది.

ఆగస్టు 11వ తేదీ నుంచి మధ్యప్రదేశ్ లో 37 స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నియి. దీంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఫోటో.. పేరు.. అతనికి ఏదైనా నేర చరిత్రా ఉందా.. ఉంటే ఎలాంటిది.. అతనికి ఎంత మేర ఆస్తులు ఉన్నాయి.. తదితర వివరాలన్నింటినీ పొందుపరచనున్నారు.ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మానవ వనరుల శాఖ అధికారి ఒకరు తెలిపారు. తాము ఎవరిని ఎన్నుకుంటున్నామనేది ప్రజలు తెలుసుకోగలుగుతారని ఈ సందర్భంగా అధికారి తెలిపారు. ఆగస్టు 11న 37 స్థానిక సంస్థలకు జరిగే ఈ ఎన్నికల్లో 14 మున్సిపాలిటీలు, 23 నగర పరిషత్ లు ఉన్నాయి. ఫలితాలు ఆగస్టు 16న తెలియజేస్తారు.