సుప్రీం కోర్టులో వింత కేసు హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ చర్చనీయాంశంగా మారిన బీజేపీ నేత పిటిషన్
భారత్ లో హిందువులు మైనార్టీలా..? అదెలా సాధ్యం. మన దేశంలో అత్యధికంగా ఉన్నదే హిందువులు కదా..? మరి వాళ్లు మైనార్టీలు ఎలా అవుతారు..? ప్రస్తుతం ఇదే విషయంపై సుప్రీం కోర్టులో ఒక కేసు దాఖలైంది. దీంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

భారత్.. ఓ హిందూ దేశం. ఎందుకంటే.. దేశంలో అత్యధికంగా హిందువులే ఉన్నారు కాబట్టి.. హిందూ దేశం అని పిలుస్తుంటారు. ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ మతస్థులు చాలా తక్కవ సంఖ్యలో ఉన్న మాట వాస్తవం. అందుకే ఆ మతస్థులను మైనార్టీలుగా పరిగణించి.. వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తుంటారు. అయితే... మన దేశంలోని 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో హిందువులే మైనార్టీలు. సుప్రీం కోర్టులో కేసు ఫైల్ అయ్యే వరకు ఈ విషయం చాలా మందికి తెలియదు.
లక్షద్వీప్ (కేంద్ర పాలిత ప్రాంతం), మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, జమ్మూకశ్మీర్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, పంజాబ్లలో ఇతర మతస్థులతో పోలిస్తే.. హిందువుల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి.. వారిని మైనార్టీలుగా గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందజేయాలని తాజాగా ఓ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషన్ మేరకు ఆయా రాష్ట్రాల్లో హిందువుల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ.. వారిని మైనార్టీలుగా గుర్తించడం లేదు. అధిక సంఖ్యలో వారే మైనార్టీలుగా చలామణి అవుతున్నారు. కాబట్టి ఆ 8 రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా గుర్తించాలని కోరారు.
అసలు మైనార్టీలు అని ఎవరిని అంటారు..?
రాజ్యాంగం ప్రకారం మన దేశంలో రెండు రకాల అల్పసంఖ్యాక వర్గాలున్నాయి. ఒకటి... భాషాపరమైన, రెండు... మతపరమైన! రాజ్యాంగంలోని ఆర్టికల్ 30లో దీని గురించి ప్రస్తావించారు. దేశంలో 40శాతం మంది హిందీ మాట్లాడుతున్నారు. వీరు మినహా... మిగిలిన వారంతా ‘భాషాపరమైన మైనారిటీ’లే! అయితే,భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత... దీని నిర్వచనం మారింది. ఆ రాష్ట్రంలో తమ మాతృభాష వాడేవారే అత్యధికులుగా ఉంటారు. కాబట్టి ఆ రాష్ట్రానికి, ఇతర ప్రాంతాల నుంచి(మరో మాతృభాష ఉన్నవారు) వచ్చిన వారే భాషాపరమైన మైనారిటీలు అవుతారు.

మతం విషయానికొస్తే మొత్తం జనాభాలో ఎంత శాతంలోపు ఉన్న వారిని మతపరమైన మైనారిటీగా పరిగణించాలనే విషయంపై స్పష్టత లేదు. రాజ్యాంగంలో దీనికి ఎలాంటి నిర్వచనమూ లేదు. దీంతో ‘మెజారిటీ’ కాని వారంతా మైనారిటీలే అనే భావన కొనసాగుతోంది. పలు సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకొని మైనారిటీల హక్కులను విద్యకు పరిమితం చేయాలని తెలిపాయి. మతపరమైన మైనారిటీలను రాష్ట్రాల స్థాయిలోనే గుర్తించాలంటూ 2002లో సుప్రీం తీర్పు చెప్పింది. జనాభాను కాకుండా, రాష్ట్రం యూనిట్గా తీసుకొని ఏ మతం మైనారిటీ కిందికి వస్తుందో నిర్ణయించాలని స్పష్టం చేసింది.
