రేపు నోట్ల రద్దు పై  తన లైన్ స్పష్టంచేయనున్న పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ఇంతవరకు నోట్ల రద్దు గురించి పెద్ద గా మాట్లాడ లేదు.

దేశమంతా సుడిగాలిలా చుట్టుముట్టి పేద లో నోట్లో మన్నుగొడుతున్న నోట్లు రద్దు అనబడే ఈ డిమానెటైజేషన్ గురించి వివరంగా మాట్లాడకపోతే వెలితిగా నే ఉంటుంది.

ఎందుకంటే, తెలుగు ముఖ్యమంత్రులిద్ద బిజెజి ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా ఈ విషయంలో ప్రధాని మోదీని మోస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ధోరణిలో ఢిల్లీ పర్యటన తర్వాత మార్పు వచ్చిందని, ఢిల్లీ వెళ్లడానికి ముందు విమర్శించిన కెసిఆర్ ఢిల్లీ వెళ్లి మోదీ మాట్లాడిన తర్వాత డిమానెటైజేషన్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శిస్తున్నారు.

నోట్ల రద్దులో ఆంధ్ర ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడి హస్తం ఉందని ఆయనే అంగీకరించారు. ఈ మధ్య ఆయన తమ్ముళ్లు నోట్ల రద్దును విమర్శించడం మొదలుపెట్టారు. వైఎస్ఆర్ సిపి ఈ విషయాన్న అంత తీవ్రంగా పరిగణించలేదు. ఈ నేపథ్యంలో పవన్ స్టాండ్ కూడా వెల్లడికావలసి ఉంది.

ఈ సస్పెన్స్ కు తెరతీస్తూ రేపు నోట్ల రద్దు గురించి, మోదీ ప్రభుత్వం బంగారుబాట గురించి మాట్లాడతానని పవన్ ప్రకటించారు.

దీనితో పవన్ ట్వీట్ సీరియల్ ముగుస్తుంది. ఈ సారి ట్వీట్ లు ‘హిట్ అండ్ రన్’ కాకుండా తన భవిషత్ రాజకీయ పంథా మీద కొంత స్పష్టత ఇచ్చేందుకు ఆయన వాడుకున్నారు. 2014 లో లాగా కాకుండా ఈ సారి ఆయన తెలుగుదేశం, బిజెపిలకు దూరంగా జరగుతున్నట్లు అర్థమవుతుంది. అయితే, 2019 ఇంకారెండున్నరేళ్లుందికాబట్టి ఏమయిన జరగవచ్చు. అందువల్ల పవన్ ఐడియాలజీ గురించి ఒక నిర్ణయానికి రావడం కష్టం.