సినారె సాహితీ సౌరభం చిరకాలం ఉంటుంది
విశ్వంభర రచన ద్వారా జ్ఞానపీఠ్ అవార్డు అందుకుని తెలుగు భాష కీర్తిని విశ్వవ్యాపితం చేశారు. పద్మశ్రీ, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ వంటి అనేక పురస్కారాలు, రాజ్యాంగ పదవులు ఆయనలోని వినమ్రతను మరింత పెంచాయి.
సినారె మృతి పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సినారె. తండ్రి వ్యవసాయం చేస్తే... సి.నా.రె. మాత్రం సాహితీ వ్యవసాయం చేశారని కొనియాడారు పవన్...
పవన్ ఇంకా ఏమన్నారంటే...
తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి మరణం తెలుగు జాతికే కాక యావత్ సాహితీ లోకానికి తీరని లోటు. తెలుగు సినిమా పాటను కావ్య స్థాయికి తీసుకెళ్లిన ఆ మహానుభావుని స్థానం భర్తీ చేయలేనిది. ఆయన జీవితం గురించి సినీ పెద్దల ద్వారా, కొన్ని రచనల ద్వారా తెలుసుకున్నప్పుడు శ్రీ నారాయణ రెడ్డి సదా ఆదర్శప్రాయుడు అని భావించాను.
విశ్వంభర రచన ద్వారా జ్ఞానపీఠ్ అవార్డు అందుకుని తెలుగు భాష కీర్తిని విశ్వవ్యాపితం చేశారు. పద్మశ్రీ, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ వంటి అనేక పురస్కారాలు, రాజ్యాంగ పదవులు ఆయనలోని వినమ్రతను మరింత పెంచాయి.
తండ్రి వ్యవసాయం చేస్తే సి.నా.రె. సాహితీ వ్యవసాయం చేసి తెలుగు సాహిత్య ఫలాలను అందించారు. ఇంతటి సాహితీ స్రష్ట మరణించారని తెలిసి ఆవేదన చెందాను. సి.నా.రె. భౌతికంగా లేకపోయినా ఆయన వెదజల్లిన సాహిత్య సౌరభాలు మన మధ్య చిరంతనంగా పరిమళిస్తూనే ఉంటాయి.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు నా తరుపున, జనసేన శ్రేణుల తరుపున ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను.