మొదలైన జగన్ పాదయాత్ర త్వరలో యాత్ర మొదలుపెట్టనున్న పవన్ యాత్రకు సంసిద్ధమౌతున్న పవన్

జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ త్వరలో యాత్ర చేపట్టనున్నారు. వైసీపీ అధినేత జగన్ సోమవారం ప్రజాసంకల్ప యాత్ర మొదలైన సంగతి తెలిసిందే. కాగా..త్వరలోనే పవన్ కూడా యాత్ర ప్రారంభించనున్నారు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా తలపడనున్నట్లు ఇప్పటికే పవన్ ప్రకటించేశారు. అలా ప్రకటించిన నాటి నుంచి ఆయన పాదయాత్ర చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. కానీ.. దానిపై ఎప్పుడూ పూర్తి స్పష్టత ఇవ్వలేదు.

తాజాగా ఇదే విషయంపై మరోసారి ప్రచారం ఊపందుకుంది. పవన్ మరికొద్ది రోజుల్లో పాదయాత్ర ప్రారంభించనున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఏ రూట్లో, ఏ విధంగా పర్యటిస్తారన్న అంశంపై ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. పాదయాత్ర ద్వారా పవన్‌ కళ్యాణ్ జనానికి చేరువ కావాలా లేదా, బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లాలా అన్నది జనసేనలో ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

ఈ విషయం పక్కన పెడితే.. పవన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆయన పాదయాత్ర చేస్తున్నారని తెలిస్తే.. అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావడం ఖాయం. ఎక్కువ మంది గుమ్మిగూడి.. ఆయనను కదలనీయకుండా చేస్తారేమో అనే సందేహం ఇప్పుడు జనసేనలో మొదలైందట. ఇదే విషయాన్ని పవన్ గతంలో వ్యక్తపరిచారు కూడా. అందుకని పాదయాత్ర కాకుండా బస్సు యాత్ర చేస్తే  ఎలా ఉంటుందని చర్చించుకుంటున్నారు. అయితే.. బస్సు యాత్రతో కాకుండా.. పాదయాత్ర చేస్తేనే జనాల్లోకి వెళ్లినట్లు అవుతుందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. సరే..పాదయాత్ర అయినా..బస్సు యాత్ర.. అయినా మరికొద్దిరోజుల్లో యాత్ర ప్రారంభమవ్వడం మాత్రం ఖాయమని తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ముందుగా ఏపీలో.. ఆ తర్వాత తెలంగాణలో పర్యటించాలని పవన్  భావిస్తున్నారట. దీనికి అనుగణంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.