సంపన్నులు,పలుకుబడి ఉన్నవాళ్లు చట్టానికి దొరకరన్న అపవాదు  పొగొట్టాల్సిన  బాధ్యత కోర్టుల మీద ఉంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి సంబంధం ఉన్నట్లు చెబుతున్న ‘ఓటుకు నోటు’ కేసు మీద నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరుతూ సంతకాల ఉద్యమం మొదలయింది.

అన్ లైన్ ద్వారా చేపట్టిన సంతకాల ఈ ఉద్యమానికి విశేష స్పందన లభిస్తూ ఉంది. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వోటుకు నోటు కేసు మీద విచారణ కోరుతూ సుప్రీం కోర్టు ఒక పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్ SLP(CRL) NO. 1732/2017 మీద సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసుల పంపించింది. ఈ సందర్భంగా ఈ అన్ లైన్ సంతకాల ఉద్యమం మొదలయింది.

వోటుకు నోటు కేసుగా పేరుపొందిన ఈ కేసులో నిష్పాక్షికంగా విచారణ జరిపించాల్సిన అసవరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ ఈ సంతకాల ఉద్యమం change.org ద్వారా మొదలయింది.

24 గంటలు తిరగక ముందే ఈ పిటిషన్ మీద సుమారు 4910 మంది సంతకాలు చేశారు.

 వోటుకు నోటు వ్యవహారంలో దర్యాప్తు చేసిన తెలంగాణా అవినీతి నిరోధక శాఖ ఒక చార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఇందులో పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు వచ్చిందని, ఇది ఆయన పాత్ర గురించి అనుమానాలకు తావిస్తున్నదని పిటిషన్ లో పేర్కొన్నారు.

కన్సర్నడ్ సిటిజన్స్ పేరుతో ఈ పిటిషన్ మొదలయింది. పిటిషన్ ను బ్లాగర్ తిరుమల ప్రసాద్ పాటిల్ ప్రారంభించారు. సంపన్నులు, పలుకుబడి ఉన్నవారు చట్టం నుంచి సులభంగా తప్పించుకుంటారని ప్రజల్లో ఒక విశ్వాసం ప్రబలి ఉందదని, ఇది భారత ప్రజాస్వామ్యానికంతమంచిది కాదని పేర్కొంటూ ఈ అపవాదు పొగొట్టేందుకు ఈ వ్యవహారాన్ని నిష్పాక్షికంగా విచారించి దోషులను చట్టం ముందు నెలబెటాల్సిన అవసరం ఉందని పిటిషన్ దారులు పేర్కొన్నారు.

 వోటుకు నోటు కేసు అంటే... తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యే వోట్లు కొనేందుకు తెలుగుదేశం పార్టీ డబ్బు ఎర వేసిందనేది ఆరోపణ. ఇలా ఒక శాసన సభుడికి డబ్బు ఎరవేస్తున్నపుడు అవినీతి నిరోధక శాఖవీడియో ద్వారా రికార్డు చేసి ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. టిడిపి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని నడిపించినా, ఇందులో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందన్నది ఆరోపణ. దీనిమీదే విచారణ జరగాలని వైసిపి ఎమ్మెల్యే కోర్టును ఆశయించారు.