24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు.
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తబోతున్నాయి. 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.
ఒడిశాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కోస్తా, తెలంగాణ, రాయలసీమల్లో పలు చోట్ల ఇప్పటికే బారీ వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ, కోస్తాల్లో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ఆవరించి ఉందని చెప్పారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ఇవాళ, రేపు,ఎల్లుండి సిబ్బంది మొత్తం అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
