మైదుకూరులో ముస్లింల ఆందోళన భారీగా మోహరించిన పోలీసు బలగాలు
కడప జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో జిల్లా వ్యాప్తంగా మసీదులు, దర్గాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ జిల్లాలోని ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు సైతం మసీదులు, దర్గాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. అలాంటి జిల్లాలో ఓ దర్గాను అధికారులు కూల్చివేశారు. దీంతో.. అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళితే.. మైదుకూరులోని ఓ దర్గాను గురువారం ఉదయం నేషనల్ హైవే అధికారులు కూల్చివేశారు. దీంతో ముస్లింలు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది అనుకుంటుంటే.. ఆందోళన చేస్తున్న ముస్లింలకు ప్రతిపక్ష పార్టీ నేతలు మద్దతు పలికారు. దీంతో.. పరిస్థితి తీవ్రతరమైంది. దీంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళన చేస్తున్నవారిని అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దర్గా కూల్చిన స్థలంలో ఓ ముస్లిం మహిళ వేప మొక్క నాటి జెండాను పాతి ఈద్గా నిర్మించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన కొనసాగుతోంది. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మైదుకూరు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అధికార పార్టీ నేతలు మాత్రం.. మైదుకూరు దరిదాపుల్లో కనిపించకపోవడం గమనార్హం.
