మోడి నిర్ణయాన్ని ప్రజలందరూ ఆమోదించినట్లు నాలుగు గోడల మధ్య కూర్చుని వెంకయ్యనాయడు, కెసిఆర్, చంద్రబాబు తదిరులు చెప్పటం కాదు.
పెద్ద నోట్ల రద్దు విషయంలో మిత్రపక్షాల నేతలెవరూ ఇంత వరకూ ప్రజల్లోకి వెళ్లిన దాఖలాలు కనబడటం లేదు. నోట్ల రద్దు విషయంలో తన ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధానమంత్రి చెప్పి ఇప్పటికి మూడు రోజులైంది. అయినా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులెవరూ ఇంత వరకూ ఆ పని మొదలుపెట్టకపోవటం గమనార్హం.
తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మోడి నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటించారు. దానికి తోడు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ నగరంలోనే ఉన్నారు. ఇక, భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్రంలో ఐదుగురు ఎంఎల్ఏలున్నారు.
అంటే టిఆర్ఎస్, భాజపాలకు కలిపి సుమారు 80 మందికి పైగా ప్రజాప్రతినిధులు నోట్ల రద్దుకు అనుకూలంగా ఉన్నట్లే లెక్క.
శాసనసభ్యులే కాకుండా 14 మంది టిఆర్ఎస్ ఎంపిలుకూడా మద్దుతుగా ఉన్నట్లే. రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా ఉన్నా మరి ఎంఎల్ఏలు, ఎంపిలు ఎందుకు ప్రజల్లోకి వెళ్లి మోడి ఆలోచనలను ప్రజలతో పంచుకోవటం లేదో అర్ధం కావటం లేదు.
ఇదిలావుండగా, ఏపిలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఇక్కడ కూడా మోడి నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తున్నది. ఇక్కడ టిడిపి, భాజపాలకు కలిపి సుమారు 120 మంది శాసనసభ్యులున్నారు. అంతేకాకుండా మిత్రపక్షాలకు 18 మంది ఎంపిలున్నారు.
అంటే, మోడి నోట్ల రద్దుకు ప్రభుత్వ పరంగా ఇక్కడ కూడా పూర్తిస్ధాయిలో మద్దతు లభించినట్లే కదా? ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలేవి ప్రధాని నిర్ణయానికి వ్యతరేకంగా పెద్దగా ఉద్యమాలు కూడా చేపట్టటం లేదు. అయినా ఎందుకు మిత్రపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులెవరూ ప్రజల్లోకి వెళ్ళటం లేదు?
అంటే ఇక్కడ మ్యాటర్ వెరీ వెరీ క్లియర్. భాజపా ఎంపిల సమావేశంలోనో లేదా బహిరంగ సభల్లోనో మోడి చెబుతున్నట్లు క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు లేవు. మోడి నిర్ణయాన్ని ప్రజలందరూ ఆమోదించినట్లు నాలుగు గోడల మధ్య కూర్చుని వెంకయ్యనాయడు, కెసిఆర్, చంద్రబాబు తదిరులు చెప్పటం కాదు.
పార్టీ సమావేశాల్లోనో లేదా మీడియా సమావేశంలో మాట్లాడినట్లు కాదు ప్రజల్లోకి వెళ్ళటమంటే. ప్రజల మధ్యకు వెళ్ళి మోడి నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడితే ఏమి జరుగుతుందో వారికి బాగానే తెలుసు. కాబట్టే మోడి ఆదేశించి మూడు రోజులవుతున్నా ఇంత వరకూ ప్రజల్లోకి వెళ్లలేదు.
ఎటుతిరిగీ మోడి చెప్పిన ‘త్యాగాల’ 50 రోజులు మరో తొమ్మిది రోజుల్లో అయిపోతోంది. అప్పుడే తెలుస్తుందో ప్రజల్లో సహనం ఎంతుందో. అప్పటి వరకూ వేచిచూసి తర్వాతే ఏమి చేయాలో నిర్ణయించుకోవచ్చని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. చూద్దాం డిసెంబర్ 30వ తేదీ తర్వాత ఏమి జరుగుతుందో?
