మహాభారతంలో శంఖం పూరించి శ్రీకృష్ణుడు రణరంగంలోకి దిగితే.. మహాత్ముడి చరఖా పట్టి దేశ స్వాతంత్ర సమరంలో దిగాడు. అందుకే చరఖా పట్టిన ఆ బాపు బొమ్మ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఆ చరఖా నుంచి గాంధీని తొలగించి తాను ఆక్రమించాడు ప్రధానమంత్రి మోదీ.
మహాత్ముడి చరఖా...
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యపు గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది...
అఖండ భారతావనిని స్వాతంత్ర్య సంగ్రామంలోకి తీసుకొచ్చింది...
మూతపడిన స్వదేశీ పరిశ్రమలను నిలబెట్టింది...
మహాభారతంలో శంఖం పూరించి శ్రీకృష్ణుడు రణరంగంలోకి దిగితే.. మహాత్ముడి చరఖా పట్టి దేశ స్వాతంత్ర సమరంలో దిగాడు. బోసి నవ్వలు గాంధీ తాత లేని పచ్చ నోటు... చరఖా పట్టని మహాత్ముడి చిత్రాన్ని మనం ఊహించనే లేము.
కానీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మహాత్ముడిని పక్కా వ్యూహంతో చరిత్ర నుంచి తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తోంది.
దానికి ఈ సంఘటన ఓ ఉదహరణగా చెప్పొచ్చు...
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ( కేవీఐసీ) గురంచి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. విదేశీ వస్తు బహిష్కరణ లో భాగంగా 1920 లో స్వదేజీ ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అదే ఏడాది మహాత్ముడి సూచలనతో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ను ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ ఆవిర్భావం నుంచి చరఖా పట్టిన గాంధీ చిత్రంతోనే కేలండర్ లను ప్రతియేటా విడుదల చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ సూచించారా.. లేక ఆయన భక్తులు ఆదేశించారా తెలీయదు కానీ, ఈ ఏడాది కేలండర్ లో మహాత్ముడి ఫొటో మాయమైంది.
ఆయన స్థానంలో అచ్చంగా మోదీ చరఖా పట్టిన ఫొటోను ప్రతిష్టించారు. దీంతో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ లోని ఉద్యోగులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ విషయంపై ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ వినయ్ కుమార్ సక్సెనా స్పందిస్తూ... ఇదేమీ అసాధారణం కాదు... గతంలో కూడా కేలండర్ లలో మార్పులు జరిగాయని స్పష్టం చేశారు.
తమ సంస్థ గాంధీ ఆశయాలు, సిద్దాంతాల మీదే నడుస్తుందని ఆయనను విస్మరించడం ఎట్టి పరిస్థితుల్లో జరగదని తెలిపారు. మోదీ కూడా చాలా ఏళ్లుగా ఖాదీ వస్త్రాలే ధరిస్తున్నారని, ఖాదీకి భారీ స్థాయిలో ప్రచారం చేయడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.
అయితే గాంధీ స్థానంలో మోదీ చరఖా చిత్రాన్ని పెట్టడంపై సంస్థలోని కొందరు ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ భోజన విరామ సమయంలో గాంధీమార్గంలో నిరసన తెలుపుతామని ప్రకటించారు.
