ఆంధ్రలో తనకు మరొక మిత్రుడున్నాడనే సందేశం ప్రధానిమోదీ పంపుతున్నారా?  ఎన్డీయే భాగస్వామి  అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బిజెపి తెలుగురాష్ట్రాల పెద్ద  దిక్కు వెంకయ్యనాయుడు  దేశంలో లేనపుడు జగన్ తో ప్రధాని  సమావేశం కావడం విశేషం.

ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డితో ప్రధాని సమావేశం తెలుగుదేశం వర్గాల్లో బాగా చర్చనీయాంశమయింది. ప్రధాని కార్యాయలం నుంచి జగన్ పిలుపురావడం, జగన్ హుటాహుటిని ఢిల్లీ వెల్లడం ,ప్రధానితో సుదీర్ఘ సంభాషణ జరపడం జరిగింది. ఇదిటిడిపి వర్గాలను కలవర పరుస్తూ ఉంది. ఏదో ఒక విధంగా జగన్ ని వచ్చే ఎన్నికల నాటికి జైలుకు పంపాలనుకుంటున్న పార్టీ, ఇన్ని కేసులన్న జగన్ తో ప్రధాని సమావేశం కావడం ఏమిటి? పిలిపించి మాట్లాడటం దేనికి? గతంలో ప్రధానితో భేటీ ముహూర్తం ఖరారు కాకపోవడానికి వీరికి ఏమయిన సంబంధం ఉందా?

అన్నింటికంటే ముఖ్యమయిన విషయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాబివృద్దిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు విదేశాలలో ఉన్నపుడు ప్రధాని కార్యాలయం జగన్ ని ఢిల్లీకి ఆహ్వానించింది. ఎన్డీయే అధికారం లో న్న ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు, అందునా తెలుగుదేశం పార్టీకి బద్ధ శత్రువయిన వైసిపి నేతతో ప్రధాని మంతనాలు ... తెలుగుదేశం నేతలకు ఎంతకు మింగుడపడటం లేదు. 2019 ఎన్నికలలో టిడిపి ఎకైన ప్రత్యర్థి వైసిపితో ప్రధాని స్నేహమేమిటి? పార్టీ మేనేజర్లు ఉన్నపుడు ప్రధాని స్వయంగా రంగంలోకి దిగి జగన్ తో మాట్లాడటమేమిటి? ఇవి టిడిపిని తప్పకుండా ఇబ్బందిపెట్టే ప్రశ్నలే. 

కారణం ఏమిటి?

జగన్ పైకి ఎన్ని చెప్పినా, ఢిల్లీ వెళ్లడానికి కారణం రాష్ట్ర పతి ఎన్నికలే. వచ్చే రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ మద్దతు అడగడానికి స్వయాన ప్రధాని చొరవ తీసుకుని జగన్ ఢిల్లీకి రప్పించుకుని చర్చించడం అనేది రాజకీయం. తెలుగుదేశానికి మింగుడుపడని విషయం. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటినుంచి జగన్ జైలుకే అని టిడిపి ఎమ్మెల్యేలు చెబుతూనే ఉన్నారు. బెయిల్ రద్దు చేయించేందుకు సిబిఐ కూడాప్రయత్నించింది. ఏవీ సాగ లేదు. ఇలాంటపుడు, ముఖ్యమయిన నాయుళ్లిద్దరు ఇండియా లేనపుడు ప్రధాని, జగన్ దాదాపు ఒక గంట సేపు మాట్లాడుకున్నారు. వైసిపి వర్గాల ప్రకారం, ఎంపిలతో ప్రధాని సమావేశం కొద్ది సేపు జరిగితే, దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ, జగనే మాట్లాడుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల గురించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య సంధి కుదిరింది.

నిజానికి చాలా కాలంగా జగన్ ప్రధాని అపాయంట్ మెంటుకోరుతూవస్తున్నారు. దొరకడం లేదు. ఢిల్లీలో కూర్చుని కూడజగన్ ప్రయత్నం చేశారట. అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. అయితే, మంగళవారం పార్టీ ఎంపిలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, అవినాష్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలతో కలిసి వైఎస్‌ జగన్‌ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానే స్వయంగా పిలుపించుకోవడానికి కారణం జూలైలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలు.

బిజెపి ప్రతిపాదించే అభ్యర్థి గెలుపొందడానికి ఏన్డీయేకి పూర్తి మెజార్టీ లేదు. కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు కావాలి. ఇలాంటి ప్రాంతీయ పార్టీలలో సయోధ్యకు అనుకూలమయిన పార్టీ వైసిపి అనిపించింది. వైసిపికి రాత్రికి రాత్రి వర్తమానం పంపారు. సమావేశం జరిగింది. జగన్ ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.

జగన్ ప్రతిఫలం కోరి ఉంటారా?

ఇంతటి కీలకమయిన సమావేశంలో ప్రధాని మాటను గౌరవించాక జగన్ తన డిమాండ్లను ప్రధాని ముందు ఉంచకుండా పోయి ఉంటాడా?

చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి, డబ్బు ఎరవేసి వైసిపి ఎమ్మెల్యేలను లాక్కోవడం, వాళ్లకి క్యాబినెట్ పదవులివ్వడం, తన మీద అక్రమ కేసులు, పెట్టుబడుల పేరుతో చంద్రబాబు సాగిస్తున్న విదేశీయాత్రలు, పోలవరం, అమరావతి వ్యవహారాలన్నింటిని ఏకరువు పెట్టారు. వీటి మీద ప్రధానికి ఆయనొక నివేదిక కూడా ఇచ్చారని తెలిసింది.

చాలా కాలంగా కేంద్రానికి ఫిర్యాదు చేయాలనుకుంటున్న విషయాన్నింటిని ఏకంగా ప్రధానిమోదీకే విన్నవించే అవకాశం జగన్ కు దొరికింది. అదీకూడా ఎన్డీయే భాగస్వామి, ముఖ్యమంత్రి నాయుడు ఇండియాలోనే లేనపుడు. ఇది నిజంగా తెలుగుదేశం వర్గాలను కలవరపెట్టే విషయమే. బాబు నిప్పయినా, మోదీ అర్థం కావడం కష్టమే.