విపక్షాల దెబ్బకు జడిసే మోడి పార్లమెంట్ కు మొహం చాటేసారన్నది బహిరంగ రహస్యం.
నోట్ల రద్దు వేడి ప్రధానమంత్రికి బాగానే తగులుతోంది. ఆ వేడిని తట్టుకునేందుకు ప్రధాని అవస్తులు పడుతుండటం స్పష్టంగానే కనబడుతోంది. ఓవైపు సుప్రింకోర్టు, మరోవైపు ప్రతిపక్షాలు, ఇంకోవైపు సామాన్య జనాల శాపనార్ధాలు చివరగా కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ రూపంలో పార్టీలో మొదలై అసంతృప్తి జ్వాలలు.
అన్నింటికీ కారణం అనాలోచితంగా పెద్ద నోట్లను రద్దు చేయటమే. ప్రజలకు, పార్టీలోని వారికీ సమాధానాలు చెప్పకపోయినా చెల్లుబాటౌతుంది. కానీ రాజ్యాంగబద్ద వ్యవస్ధలను కూడా మోడి లెఖ్ఖే చేయటం లేదు.
అటు సర్వోన్నత న్యాయస్ధానం సుప్రింకోర్టునూ ఖాతరు చేయక, ఇటు పార్లమెంట్ ను పట్టించుకోక దేశానికి మోడి ఎటువంటి సందేశం ఇవ్వదలచుకున్నారో మరి.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పో, ఒప్పో జరిగిపోయింది. ఆ నిర్ణయం వల్ల యావత్ దేశం ఏ విధంగా అల్లాడిపోతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం కుదేలైపోయింది. దాంతో ప్రతిపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని, మోడిని కడిగిపారేస్తున్నాయి.
విపక్షాల దెబ్బకు జడిసే మోడి పార్లమెంట్ కు మొహం చాటేసారన్నది బహిరంగ రహస్యం. తన నిర్ణయం ఎంతటి తప్పో మోడి కూడా గ్రహించినట్లున్నారు. కాకపోతే అప్పటికే చేతులు కాలిపోయాయి. దాంతో మోడి చర్యను కేంద్రమంత్రులు ఎంత సమర్ధించుకుంటున్న అందులోని బేలతనం ప్రజలకు తెలిసిపోతూనే ఉంది.
పెద్ద నోట్ల రద్దు సమయంలో తాను చెప్పిన కారణాల్లో వేటినీ ఇపుడు ప్రధాని చెప్పటం లేదు. డిజిటల్ లావాదేవీలంటూ కొత్త పల్లవి అందుకోవటం విచిత్రం. అదే సందర్భంలో నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై సుప్రింకోర్టు కూడా కేంద్రాన్ని బాగానే తూర్పారబడుతోంది. దాంతో మోడికి ఏమి చేయాలో దిక్కు తెలీటం లేదు.
కోట్లాది మంది ప్రజలకు 2 వేల నోటు దొరకటమే కష్టంగా ఉన్నపుడు కుబేరులకు మాత్రం కోట్ల కొద్దీ కొత్త నోట్లు ఎలా చేరుతున్నాయన్న సుప్రిం ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పుకోలేక అవస్తలు పడుతోంది.
బ్యాంకుల్లో జరుగుతున్న అక్రమాల వల్లే కుబేరులకు కోట్ల కొద్దీ కొత్త నోట్లు లభిస్తోందని పొంతనలేని సమాధానాలిచ్చారు అటార్నీ జనరల్.
ఖాతాదారులు డిపాజిట్ చేసిన మేర వారికి తిరిగి ఇవ్వటానికి కేంద్రం వద్ద డబ్బు లేదని అర్ధం అవుతోందని సుప్రిం చేసిన వ్యాఖ్యలకు ఏమి సమాధానం చెప్పాలో కేంద్రానికి అర్ధం కాలేదు. దానికి తోడు ఈ రోజుతో పార్లమెంట్ సమావేశాలు కూడా అయిపోతాయి కాబట్టి ఇక ప్రతిపక్షాలు ఏమి చేస్తాయో చూడాలి.
